చంద్రగిరి: అకాల వర్షం కారణంగా రైతులు పంటలను కోల్పోయి అపారంగా నష్టపోయారు. బుధవారం రాత్రి మండలంలో సుమారు రెండు గంటలకు పైగా భారీ వర్షం కురిసింది. కొన్ని చోట్ల విద్యుత్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మండలంలోని బందార్లపల్లి పరిసర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడి భారీ వర్షం కారణంగా వరి, మామిడి, టమాట పంటలు దెబ్బతిన్నాయి. పంటలను నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. ప్రభుత్వ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి నష్టాన్ని అంచనా వేసి, తగిన పరిహారం అందించాలని బాధితులు కోరుతున్నారు.
గోనుపల్లిలో వడగళ్లు వాన
రాపూరు: మండలంలోని గోనుపల్లిలో బుధవారం రాత్రి కురిసిన వడగళ్లు వర్షానికి వరి, మామిడి, నిమ్మ పంటలు దెబ్బతిన్నట్లు రైతులు తెలిపారు. గ్రామంలో సుమారు 300 ఎకరాల వరి పంట కోతకు వచ్చిందని, కొందరు వరి కోతలు కోయగా మరికొందరు వరి కోత కోయాల్సి ఉందని చెప్పారు. వర్షంతో ధాన్యం మొత్తం రాలిపోగా పంట నెలకొరిగిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కొక్క రైతుకు రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు నష్టం వాటిల్లిందని రైతులు తెలిపారు. అలాగే మామిడి పూత, కాయలు రాలిపోయాయన్నారు. మంచి ధర ఉన్న సమయంలో గాలికి నిమ్మకాయలు రాలిపోయి, తీవ్రనష్టం వాటిల్లిందని రైతులు బోరుమంటున్నారు. పంట నష్టాన్ని వ్యవసాయాధికారి సోమ సుందర్ అంచనా వేశారు. శుక్రవారం ఉద్యానవన శాఖ అధికారులు పంటను పరిశీలిస్తారని ,పంట నష్టంపై ఉన్నతాధికారులకు సమాచారం అందించినట్లు ఆయన తెలిపారు.


