దొరవారిసత్రం: చెరువులో దుస్తులు ఉతికేందుకు వెళ్లిన ఓ మహిళ ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందిన ఘటన నెలబల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, కథనం మేరకు.. నెలబల్లి గ్రామానికి చెందిన వాంకిళ లక్ష్మయ్య భార్య లతమ్మ(55) ఎప్పటిలాగానే గ్రామ సమీపంలోని రెడ్డిచెరువులోకి దుస్తులు ఉతికేందుకు బుధవారం ఉయదం 11 గంటల ప్రాంతంలో వెళ్లింది. ఈ క్రమంలో చెరువులో గతంలో అక్రమంగా గ్రావెల్ తీసిన గోతుల్లోకి జారిపడిపోవడంతో నీటిలో మునిగిపోయి మృతి చెందింది. దుస్తులు ఉతికేందుకు వెళ్లిన ఆమె ఇంటికి రాకపోవడంతో ఆమె భర్త, స్థానికులు చెరువు వద్దకు వెళ్లి గాలించడంతో అప్పటికే నీటిలో మునిగిపోయి మృతి చెందినట్లు గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసుల కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
సహపంక్తి భోజనం
తిరుపతి అర్బన్: కలెక్టరేట్లో బుధవారం దివ్యాంగశక్తి కార్యక్రమం ప్రారంభం సందర్భంగా డీఆర్వో నరసింహులు, డీపీటీఓ జగదీష్, వికలాంగుల సంక్షేమశాఖ అధికారి వినోద్ తదితరులు దివ్యాంగులతో కలసి సహపంక్తి భోజనం చేశారు. అలిపిరి డిపోలో కలెక్టర్ వెంకటేశ్వర్ నేతృత్వంలో దివ్యాంగశక్తి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం కలెక్టరేట్లో భోజనం పెట్టించారు.
నిందితుడికి రిమాండ్
భాకరాపేట: ఏనుగు దంతాలు కలిగి ఉన్న కేసులో నిందితుడిని అటవీశాఖాధికారులు కోర్టులో హాజరుపరచగా అతడికి రిమాండ్ విధించారు. చంద్రగిరి మండలం చిన్నరామాపురం హరిజనవాడకు చెందిన ఓతులూరి శివకుమార్ అలియాస్ శివకుమార్ ఇంటిపై మంగళవారం దాడి చేసి, ఏనుగు దంతాలు స్వాధీనం చేసుకుని అతడిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు.


