తిరుపతి తుడా: స్థానిక ఎమ్మార్ పల్లి సమీపంలోని ఓ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ గర్భిణిగా ఉన్న విద్యార్థిపై చేయిచేసుకోవడం దారుణమని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ మేరకు బుధవారం ఎస్వీయూ పోలీస్టేషన్లో బాధితులురాలితో కలసి విద్యార్థి సంఘాలు ఫిర్యాదు చేశాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మార్ పల్లిలోని నర్సింగ్ కళాశాల ఆగడాలు శృతి మించుతున్నాయని, గతంలో పలుసార్లు వైద్యారోగ్యశాఖాధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. గర్భిణిగా ఉన్న విద్యార్థినిని బుధవారం ఆ కళాశాల ప్రిన్సిపల్ దాడి చేయడం అమానుషమన్నారు. వెంటనే సంబంధిత కళాశాల గుర్తింపును రద్దు చేసి ప్రిన్సిపల్ను అరెస్టు చేయాలని, కళాశాలలో జరుగుతున్న ఆక్రమాలపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ, ఎన్ఎస్యూఐ, పీడీఎస్యూ, ఎన్ఎల్ఎస్ఏ, జీఎన్ఎస్, ఓబీసీ, బీడీవీఎస్, ఎన్ఎన్ఎస్ఎఫ్, ఎంవీఎస్, ఏఐఎస్ఎస్ఎస్యూ నాయకులు పాల్గొన్నారు.


