తిరుమల: గుంటూరుకు చెందిన శ్రీవేంకటేశ్వర పౌల్ట్రీస్ సంస్థ అధినేత వేంకటేశ్వరరావు మంగళవారం టీటీడీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10,01,116 విరాళంగా అందించారు. ఈ మేరకు దాత శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈఓ సీహెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు నన్నపనేని సదాశివరావు పాల్గొన్నారు.
ఒంటరి ఏనుగు సంచారం
చంద్రగిరి: మండలంలోని యల్లంపల్లి, కూచివారిపల్లి, భీమవరం గ్రామాల సమీపంలో మంగళవారం ఒంటరి ఏనుగు సంచరిస్తోంది. ఫలితంగా ఎక్కడ ఒంటరి ఏనుగు దాడులకు పాల్పడుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత వారం రోజులుగా ఏనుగుల మంద పంట పొలాలపై దాడులు చేసి, ధ్వంసం చేశాయి. సమాచారం అందుకున్న అటవీ అధికారులు ఒంటరి ఏనుగును అడవిలోకి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
నేటి నుంచి దివ్యాంగశక్తి పథకం
తిరుపతి అర్బన్: ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేయడానికి దివ్యాంగశక్తి పథకాన్ని బుధవారం నుంచి అమల్లోకి తీసుకొస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ గోవిందరావు వెల్లడించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లో డీఆర్వో నరసింహులతోపాటు పలువురు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ సీ్త్రశక్తి పథకానికి మహిళలకు ఉచితంగా ప్రయాణం చేయడానికి పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సాధారణ ఎక్స్ప్రెస్లోనే దివ్యాంగులకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. అయితే 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులు, 100 శాతం కంటి చూపు, మూగ, చెవుడు, మానసిక వైకల్యం ఉన్న వారికి ఆర్టీసీ సర్వీసుల్లో ఉచిత ప్రయాణం ఉంటుందని చెప్పారు. అలాగే వారికి సహాయకులకు 50 శాతం రాయితీ ఉంటుందని చెప్పారు. ఉచిత ప్రయాణానికి అవసరమైన డిజిటల్ పాస్లు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ యాప్, ఏపీఎస్ ఆర్టీసీ యాప్ ద్వారా పొందవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డీపీటీఓ జగదీష్, వికలాంగుల సంక్షేమశాఖ అధికారి వినోద్ తదితరులు పాల్గొన్నారు.
మ్యుటేషన్ వేగవంతం చేయండి
తిరుపతి అర్బన్:మ్యుటేషన్ దరఖాస్తుల్లో జాప్యం లేకుండా వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ గోవిందరావు వెల్లడించారు. మంగళవారం ఆయన డీఆర్వో నరసింహులుతోకలసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మ్యుటేషన్ ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అలాగే రీసర్వేలోను తప్పులు లేకుండా ప్రక్రియను వేగవంతం చేయాలని వెల్లడించారు. మరోవైపు సివిల్ సప్లయి కోర్టు కేసులు, క్యాస్ట్ వెరిఫికేషన్లోనూ ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. అలాగే పాస్పుస్తకాల జారీలోని పటిష్టమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.


