రేణిగుంట: అమ్మవారి దర్శనం చేయిస్తానని నమ్మించి, నిర్మానుష ప్రదేశానికి తీసుకువెళ్లి వ్యక్తిని బెదిరించి బైకు, వెండి గొలుసు, మొబైల్ ఫోన్ను దోపిడీ చేసిన కేసులో దొంగలను అరెస్టు చేశారు. రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ శ్రీనివాసరావు మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. రాజంపేటకు చెందిన నరసింహ నాయక్ ఈ నెల 12వ తేదీ కరకంబాడిలోని కట్ట పుట్టాలమ్మ ఆలయంలో మద్యం మానేయడానికి దారం కట్టుకునేందుకు వచ్చారు. చివరగా మద్యం తాగుదామని దగ్గరలోని మద్యం దుఖాణానికి వెళ్లి మద్యం సేవిస్తుండగా జయచంద్ర, సాంబ రమేష్ అనే ఇద్దరు వ్యక్తులు పరిచయమయ్యారు. దేవాలయంలో పూజారి తమకు పరిచయం ఉందని నీకు ప్రత్యేక పూజలు చేయిస్తానని నమ్మబలికి నరసింహనాయక్ డబ్బులతోనే ముగ్గురు మద్యం సేవించారు. అనంతరం దేవాలయానికి తీసుకు వెళతానని పక్కన ఉన్న అంకమ్మ నాయుడు మిట్ట గ్రామం సమీపంలోని నిర్మానుష ప్రదేశానికి తీసుకువెళ్లి నరసింహ నాయక్ ను బెదిరించి అతని వద్ద నుంచి స్పెండర్ ప్లస్ మోటార్ సైకిల్, సుమారు 11 గ్రాముల వెండి గొలుసు, రియల్ మీ మొబైల్ ఫోను లాక్కొని పరారయ్యారు. స్నేహితుల సూచనలతో నరసింహనాయక్ 15వ తేదీ అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఐ జయచంద్ర, ఎస్ఐ ధర్మారెడ్డి తమ సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టి నిందితులను 48 గంటల్లో అరెస్టు చేసి, వారి వద్ద నుంచి సొత్తును రికవరీ చేశారు. సమావేశంలో సీఐ జయచంద్ర, ఎస్ఐ ధర్మారెడ్డి పాల్గొన్నారు.


