మామిడి చెట్లు నాటేందుకు ఆక్రమణ గుట్ట కింద ఏడాది క్రితమే టీడీపీ నేత పాగా అధికారులకు తెలిసినా పట్టించుకోని వైనం రామచంద్రాపురం మండలంలో పచ్చని కొండలు మాయం
●
సాక్షి టాస్క్ఫోర్స్: రామచంద్రాపురం మండలం తిరుపతి నగరానికి సమీపంలోనే ఉంది. ఎక్కువ మంది ఇక్కడ ఇళ్లు నిర్మించుకుని నివాసాలు ఏర్పరుచుకుంటున్నారు. దీంతో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కూటమి నాయకుల కన్ను ప్రభుత్వ భూములు, గుట్టలు, కొండలపై పడింది. ఈ క్రమంలో కొందరు నాయకులు నకిలీ పట్టాలు సృష్టించుకుని గుండోడు కనంపై పాగా వేశారు. గుట్టను చీల్చి లేయర్లు, లేయర్లుగా చదును చేసుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా మండలానికి చెందిన ఒక టీడీపీ నేత కనంలో మరోవైపు దారి పేరుతో నిలువు దోపిడీ చేసేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఆర్ అండ్ బీ రోడ్డుకు ఆనుకుని ఉన్న అటవీ భూమిని ఆక్రమించుకున్నాడు. ప్రశ్నించిన వారిపై దౌర్జన్యాలకు దిగుతున్నారని స్థానిక ప్రజలు వాపోతున్నారు. అడవులను ఆక్రమించుకునేందుకు కూటమి నాయకులకు ప్రత్యేక చట్టాలు ఏమైనా ఉన్నాయా అని వారు ప్రశ్నిస్తున్నారు.
యంత్రాలతో విధ్వంసం
ప్రస్తుతం గుండోడు కనం ప్రాంతంలో భారీ యంత్రాలతో గుట్టలను చీలుస్తున్నారు. పచ్చని చెట్లు, బోధ పొదలతో కళకళలాడే ఈ ప్రాంతం ఇప్పుడు మట్టి దిబ్బలుగా మారింది. దీనివల్ల పర్యావరణం దెబ్బతింటోదని ప్రకృతి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల అండతోనే అక్రమాలు..?
రామచంద్రాపురం మండలం తిరుపతికి అత్యంత సమీపంలో ఉండడంతో ఇక్కడ భూములకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇదే అదునుగా భావించిన కొందరు కూటమి నేతలు అటవీ భూములను అంచెలంచెలుగా ఆక్రమించుకుంటున్నారు. ఇంత పెద్ద ఎత్తున అడవులను చిన్నాభిన్నం చేసి గ్రావెల్, మట్టి తరలింపుతోపాటు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, ఫామ్ హౌస్ల నిర్మాణం చేపడుతున్నా అధికారులు మౌనంగా ఉండడంపై మండల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ, అటవీ శాఖ అధికారుల అండతోనే ఈ అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జేసీబీలతో యథేచ్ఛగా విధ్వంసం
అది అటవీ భూమిగా ఉంది
రెవెన్యూ విలేజ్ మ్యాప్లో సదరు భూమి అటవీ ప్రాంతంగా చూపిస్తున్నప్పటికీ, అధికారికంగా తమ శాఖకు సంబంధించి ఎలాంటి క్షేత్రస్థాయి హద్దులు లేవు. గతంలోనూ, ప్రస్తుతం అన్యక్రాంతమైనట్లు చెబుతున్న ఈ ప్రాంతంలో గాలేరు– నగరి ప్రాజెక్టు కాలువ పనులు జరిగాయి. అవి పూర్తిగా రెవెన్యూ అధికారుల పరిధిలోకి వస్తా యి. ఆక్రమణదారులు ఏ రకమైన పట్టాలతో ఈ భూముల్లోకి ప్రవేశిస్తున్నారో మాకు తెలియదు.
– ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బాలిశెట్టి తులసయ్య
అధికారుల మౌనం అక్రమార్కులకు వరం
గుండోడు కనం దగ్గర ఇంత బహిరంగంగా విధ్వంసం జరుగుతున్నా, స్థానికులు ఫిర్యాదులు చేస్తున్నా అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహ రించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. మండలంలో అనుప్పల్లి, సి రామాపురం, రాయలచెరువు, గణేష్ పురం ప్రాంతాల్లో ఇప్పటికే ఎకరాల అటవీ భూమి అక్రమార్కుల చెరలోకి చేరిపోయిందని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. తరతరాలుగా ఇక్కడ ఉన్న గుట్టలను కళ్ల ముందే తవ్వేస్తుంటే బాధగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి నకిలీ పట్టాల గుట్టును రట్టు చేసి, కబ్జాలను అడ్డుకోకపోతే భవిష్యత్తులో గుట్టలు కనిపించవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


