రేణిగుంట: మండలంలోని ఎల్లమండ్యం పంచాయ తీలోని అడుసుపాళెం జగనన్న కాలనీలో తవ్వుతు న్న పంట కాలువ పనులను తాత్కాలికంగా ఆపివేశారు. కాలనీలో రెండురోజులుగా ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ప్లాట్లలో పంట కాలు వ తవ్వకాలు చేపట్టారు. శనివారం ఉదయం ఇంటి పట్టాలు ఉన్న మహిళలు హిటాచికి అడ్డుగా కూర్చొని, నిరసన తెలిపి, పనులను అడ్డుకున్నారు. అదే సమయంలో కాంట్రాక్టర్ అనుచరులు అక్కడికి వచ్చి మహిళలను బెదిరించే ధోరణితో మాట్లాడడంతో ఇరువురు మధ్య వాగ్యవాదం చోటుచేసుకుంది. వివాదం పెద్దదయ్యే తరుణంలో వీఆర్వో రామ్మూర్తి సంఘటన స్థలానికి చేరుకుని తహసీల్దార్కు విషయం అందజేశారు. దీంతో ఆయన తాత్కాలికంగా కాలువ తవ్వకాలను నిలిపివేయమన్నట్లు తెలిపి, పనులను ఆపివేశారు. తహసీల్దార్ అందుబాటులో లేరని సోమవారం తహసీల్దార్ వచ్చి సమస్య పరిష్కరిస్తారని అప్పటివరకు తవ్వకాలు నిర్వహించకూడదని వీఆర్వో తెలిపారు. తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా తమ ప్లాట్లలో కాలువ తవ్వారని, తమ ప్లాట్లు యథావిధిగా ఇచ్చేంత వరకు హిటాచి పంపబోమని బాధితులు వీఆర్వోకు తెలిపారు. వీఆర్వో అక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత స్థానిక టీడీపీ నాయకుడు, జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు కాలనీ వద్దకు చేరుకుని పనులను ఆపడంపై ఆగ్రహం వ్యక్తం చేసి, బెదిరించారని బాధితులు వాపోయారు. ప్రభుత్వ పనికే అడ్డు చెబుతారా? మీకు ప్రభుత్వం నుంచి వచ్చే ఎటువంటి పథకాలు రానీయమని, ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఇంటి పట్టాలను రద్దు చేస్తామని హెచ్చరించినట్లు బాధితులు తెలిపారు. తాము ప్రభుత్వ పనులకు ఎప్పుడు అడ్డు చెప్పమని, కానీ తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా తమ ప్లాట్లలో అన్యాయంగా తవ్వకాలు జరుపుతుంటే అడ్డుకున్నామని, తమ బాధను చెబుతుంటే టీడీపీ నాయకులు బెదిరింపులకు దిగడం అన్యాయంగా ఉందని ఆవేదన చెందారు. ఉన్నతాధికారులు తమ ప్లాట్ల ను పరిశీలించి తమకు న్యాయం చేయాలని కోరారు.


