ఎరచ్రందనం కేసులో ముగ్గురికి జైలు | - | Sakshi
Sakshi News home page

ఎరచ్రందనం కేసులో ముగ్గురికి జైలు

Mar 14 2026 7:21 AM | Updated on Mar 14 2026 7:21 AM

తిరుపతి లీగల్‌: ఎరచ్రందనం దుంగల అక్రమ రవాణా కేసులో ముగ్గురికి ఒక్కొక్కరికి రెండు సంవత్సరాలు జైలుశిక్ష, రూ.20వేల చొప్పున జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎరచ్రందనం కేసుల విచారణ సెషన్‌న్స్‌ జడ్జి నరసింహమూర్తి శుక్రవారం తీర్పు చెప్పారు. కోర్టు లైజనింగ్‌ అధికారి హరిప్రసాద్‌, కోర్టు కానిస్టేబుల్‌ రవి కథనం మేరకు.. 2014 నవంబర్‌ మూడో తేదీ రొంపిచర్ల పోలీసులు ఆడినవారిపల్లి– రొంపిచర్ల మండలం మార్గంలో తనిఖీలు చేపట్టారు. అన్నమయ్య జిల్లా, కలకడ మండలం, గుట్టపల్లి, బండ్లవంకకు చెందిన కంభం తేజ ప్రకాష్‌ రెడ్డి, పీలేరు, బండ్ల వంక గంగమ్మ గుడివీధికి చెందిన కలవపల్లి గురునాథ్‌, పీలేరు, తిరుపతి రోడ్డు, శ్రీనగర్‌ కాలనీకి చెందిన చిట్టమూరి శివకుమార్‌తోపాటు మరో ఏడుగురు శేషాచలం అటవీ ప్రాంతంలోకి మారణాయుధాలతో అక్రమంగా ప్రవేశించి పది ఎరచ్రందనం చెట్లను నరికి ఎరచ్రందనం దుంగలుగా మార్చి వంకిరెడ్డివారిపల్లి సమీపంలోని పొదల్లో ఆరు ఎరచ్రందనం దుంగలను దాచిపెట్టారు. నాలుగు ఎరచ్రందనం దుంగలను కారులో తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసులు పదిమందిని అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరిచారు. కేసు పూర్వపరాలు పరిశీలించిన న్యాయమూర్తి ముగ్గురికి మాత్రం శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. మరో ఏడుగురిపై కేసును కొట్టివేస్తూ తీర్పులో పేర్కొన్నారు.

గ్యాస్‌ నిల్వలున్నాయి

తిరుపతి అర్బన్‌: రూరల్‌ మండలంలోని వేదాంతపురం పంచాయతీలోని శ్రీబాలాజీ టీటీడీ కోఆపరేటివ్‌ భారత్‌ గ్యాస్‌ గోడౌన్‌లో జిల్లా సివిల్‌ సప్లయి అధికారి శేషాచలం రాజు శుక్రవారం మద్యాహ్నం తనిఖీలు నిర్వహించారని జాయింట్‌ కలెక్టర్‌ గోవిందరావు శుక్రవారం రాత్రి ఓ ప్రకటనలో వెల్లడించారు. అయితే భారత్‌ గ్యాస్‌కు సంబంధం లేకుండా గో–గ్యాస్‌ అను ప్రైవేటు సంస్థకు చెందిన వాణిజ్య సిలిండర్లు గుర్తించినట్లు చెప్పారు. అయితే వాటిలో వాణిజ్య పుల్‌ సిలెండర్లు 595, వాణిజ్య ఖాళీ సిలెండర్లు 149 ఉన్నాయని తెలిపారు. అయితే గోడౌన్‌ యజమాని లేకపోవడంతో అక్కడ పనిచేస్తున్న గోపి అనే వ్యక్తిని విచారించినప్పటికి సరైన సమాధానం చెప్పలేదని స్పష్టం చేశారు. దీంతో గో–గ్యాస్‌ సిలెండర్లుతోపాటు భారత్‌ గ్యాస్‌ సిలెండర్లు ఫుల్‌ 230, ఖాళీ సిలెండర్లు 82 నిత్యవసర చట్టం 1955లోని సెక్షన్‌ 6ఏ ప్రకారం పంచాయతీ ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించి సీజ్‌ చేసినట్లు చెప్పారు. వాటి విలువ సూమారు రూ.19,75,670 ఉంటుందని తెలిపారు. అలాగే వారిపై నిత్యావసర సరుకుల చట్టం 1955 సెక్షన్‌ 7–1 కింద క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని పోలీసులను ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఎల్‌పీజీకి చెందిన ఏ సమస్య ఉన్న టోల్‌ ఫ్రీ నంబర్‌ 0877 2236007కు తెలియజేయాని సూచించారు.

రోడ్డుకు అడ్డంగా దేవాలయ పందిళ్లు

ఇబ్బందులు పడుతున్న స్థానికులు

సాక్షి టాస్క్‌ ఫోర్స్‌: రేణిగుంట మండలం, జీ పాళెం పంచాయతీలోని పద్మానగర్‌, జగనన్న కాలనీ మధ్యలో ఉన్న రోడ్డులో అమ్మవారి ఆలయ పూజల పేరుతో రోడ్డుకి అడ్డంగా పందిళ్లు వేయడం వివాదంగా మారింది. ఒక వీధికి అడ్డంగా పందిళ్లు వేయడంతో ఆ వీధిలోని వారు రాకపోకలు సాగించాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిర్వాహకులకు ఇదే విషయాన్ని చెప్పిన అధికార పార్టీ నాయకుల అండ దండలతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. ఆలయ పూజలకు ఎవరు అడ్డు చెప్పారని, కానీ ఇలా వీధులకు అడ్డంగా పందిళ్లు వేసి అడిగిన వారిపై దౌర్జన్యం చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సైతం అధికార పార్టీ నాయకుల మాటలు విని ఎటువంటి చర్యలు తీసుకోలేదని అంటున్నారు. స్థానికంగా కార్తికేయ సొసైటీ అనే పేరుతో కొందరు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, కార్తికేయ సొసైటీ చేస్తున్న పనులు పై అధికారులు విచారణ చేసి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement