తిరుపతి తుడా: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న బర్డ్ ఆస్పత్రిలో రెండేళ్ల కాంట్రాక్టు ప్రాతిపదికన పలు డాక్టర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తునట్లు డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో ఆర్థో ప్రొఫెనర్ పోస్టు ఒకటి, అనస్తీషియా ప్రొఫెసర్ 2, ఆర్థో అసోసియేట్ ప్రొఫెసర్ 3, అనస్తీషియా అసోసియేట్ ప్రొఫెసర్ 1, ఆర్థోపెడిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఒకటి, అసిస్టెంట్ ప్రొఫెసర్ అనస్తీషియా 7, ఒక మెడికల్ ఆఫీసర్, ఆర్థో, అనస్తీషియా జూనియర్ రెసిడెంట్ 4, సీనియర్ రెసిడెంట్ 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఈనెల 16వ తేదీ లోపు దరఖాస్తులు బర్డ్ డైరెక్టర్ కార్యాలయంలో అందించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దరఖాస్తులకు, మరిన్ని వివరాలకు టీటీడీ వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.
మూడు ధాన్యం లారీల సీజ్
దొరవారిసత్రం: విజిలెన్స్ అధికారుల తనిఖీలో నెల్లూరు నుంచి చైన్నెకు ఎలాంటి పత్రాలు లేకుండా అక్రమంగా వెళుతున్న మూడు ధాన్యం లారీలను దొరవారిసత్రం సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం రాత్రి పట్టుకుని సీజ్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఈ మూడు ధాన్యం లారీల యజమానులకు విజలెన్స్ అధికారులు జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు.
విద్యార్థి మృతదేహం అప్పగింత
నాయుడుపేట టౌన్: రోడ్డు ప్రమాదంలో మరణించిన విద్యార్థి మృతదేహాన్ని గురువారం తల్లిదండ్రులకు అప్పగించారు. పట్టణంలోని జాతీయ రహదారి కూడలి వద్ద కంటైనర్, టీవీఎస్ స్కూటీని ఢీకొన్న ప్రమాదంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి షేక్ షమీవుల్లా (16) మృతి చెందిన విషయం తెలిసిందే. గురువారం ఇంటర్మీడియట్ పరీక్షలు రాయాల్సిన షమీవుల్లా రోడ్డు ప్రమాదంలో కానరాని లోకాలకు వెళ్లడంతో విద్యార్థి తల్లిదండ్రులు షేక్ షామీర్, పర్వీన్ రోదనలకు అంతులేకుండా పోయింది. స్థానిక ప్రభుత్వ వైద్యశాల వద్ద షమీవుల్లా మృతదేహానికి పోస్టుమార్టమ్ నిర్వహించి గురువారం పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు.
గంజాయి కేసులో ముగ్గురి అరెస్టు
– రెండు కిలోలు స్వాధీనం
శ్రీకాళహస్తి: గంజాయి కేసులో ముగ్గురు అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ నరసింహమూర్తి తెలిపారు. గురువారం రెండో పట్టణ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. డీఎస్పీ కథనం మేరకు.. శ్రీకాళహస్తి రెండో పట్టణ సీఐకి గురువారం ఉద యం గంజాయి విక్రయిస్తున్నట్లు రహస్య సమాచారం అందింది. దీనిపై స్పందించిన సీఐ తన సిబ్బందితో కలిసి శ్రీకాళహస్తి–బుచ్చినాయుడుకండ్రిగ మార్గంలోని ఎంజీఎం ఆస్పత్రి సమీపంలో దాడులు చేసి ముగ్గురి అరెస్టు చేశారు. వారి వద్ద ఉన్న రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు కొటంబేడు రాజా అరకు నుంచి తెచ్చిన గంజాయిని దుర్గాప్రసాద్, వర్షిత్కు విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.
తిరుమలలో ఆకస్మిక తనిఖీలు
తిరుమల : భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుమలలోని హోటళ్లలో రెవెన్యూ, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆహార భద్రతా సిబ్బంది సన్నిధానం ప్రాంతం నుంచి తనిఖీలను ప్రారంభించారు. ఐస్క్రీమ్లు, తాగునీరు, పాలు వంటి త్వరగా పాడయ్యే ఆహార పదార్థాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు అధికారులు తెలిపారు. తిరుమలలోని అన్ని హోటళ్లలోనూ నమూనాలను సేకరించినట్లు ఫుడ్ సేఫ్టీ అధికారి జగదీష్ తెలిపారు.


