ఏర్పేడు:గుడిమల్లంలో వెలసిన ఆనందవళ్లీ సమేత పరశురామేశ్వరాలయంలో ఆదివారం శాస్త్రోక్తంగా బాలాలయ స్థాపన చేపట్టారు. అత్తి చెక్కతో రూపొందించిన స్వామి,అమ్మవార్ల ప్రతిమలను ప్రతిష్టించారు. ఏప్రిల్ 19వ తేది నుంచి ఐదు రోజులపాటు నిర్వహించనున్న మహా కుంభాభిషేకం సందర్భంగా పరశురామేశ్వరుని ఆలయ గర్భగుడితోపాటు ఆనందవళ్లి,శ్రీవళ్లీ,దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి, సూర్య భగవానుని ఆలయాలను మూసివేశారు. రాజగోపురంతో పాటు ఇతర కీలక ప్రాంతాలలో మరమ్మతులు చేపట్టారు. ఈ క్రమంలో ఆగమ శాస్త్రం ప్రకారం మూలవిరాట్ శక్తులను తాత్కాలికంగా అత్తి చెక్కతో చేసిన ప్రతిమలోకి ఆవాహన చేసి, ప్రత్యేకంగా నిర్మించిన బాలాలయంలో ప్రతిష్టించారు.


