వైభవంగా గొబ్బెమ్మ ఉత్సవం
శ్రీకాళహస్తి: ధనుర్మాసం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరాలయంలో శుక్రవారం మనోన్మణి(గొబ్బెమ్మ)కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలోని అలంకార మండపంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. అనంతరం విశేషంగా అలంకరించి ధూప, దీప నైవేద్యాలు సమర్పించారు. అమ్మవారిని చప్పరాలపై కొలువుదీర్చి పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
బైక్ చోరీ
భాకరాపేట : మెడికల్ షాపు వద్ద ఆపి ఉన్న మోటారు సైకిల్ చోరీ జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఎరవ్రారిపాళెం మండలం వీఆర్ అగ్రహారం గ్రామానికి చెందిన ఎం మనోహర్రెడ్డి తన భార్యతో కలిసి చిన్నగొట్టిగల్లులో సరుకులు తెచ్చుకోవడానికి వెళ్లారు. ఆ సమయంలో మెడికల్షాపు ఎదుట హోండా యూనికాన్ మోటారు సైకిల్ ఆపి, సరుకుల కోసం వెళ్లాడు. అదే అదనుగా భావించిన గుర్తుతెలియని వ్యక్తులు బైక్ చోరీ చేశారు. బాధితుడు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


