ఇంటర్ 2026 –27 విద్యా సంవత్సరం ప్రారంభం
ప్రభుత్వ కళాశాలలలో తొలిరోజు
2 శాతం మించని హాజరు
కాలేజీల పునఃప్రారంభంపై అవగాహన కల్పించని ప్రభుత్వం
జిల్లాలో తాళాలు తెరుచుకోని 18కి పైగా కళాశాలలు
జిల్లాకు చేరుకోని నూతన సిలబస్ పుస్తకాలు
ఎస్పీడబ్ల్యూ జూనియర్ కళాశాలకు హాజరైన 15 మంది విద్యార్థులు
శ్రీకాళహస్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా దర్శన మిస్తున్న తరగతి గదులు
జిల్లా సమాచారం
ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 72
ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కు
వెళ్లిన విద్యార్థులు 5,299 మంది
తొలిరోజు తరగతులకు
హాజరైన విద్యార్థులు 105 మంది
టీటీడీ జూనియర్ కళాశాలలు 3
విద్యార్థుల సంఖ్య సుమారు 1,450 మంది
తొలిరోజు తరగతులకు
హాజరైన విద్యార్థులు 29
జిల్లా వ్యాప్తంగా హాజరు శాతం 2 శాతం
తొలిరోజు తాళాలు తెరుచుకోని కళాశాలలు 18
హాజరైన విద్యార్థులకు మధ్యాహ్న భోజనం నిల్
విద్యార్థి మిత్ర కిట్ అందించిన
కళాశాలలు ఆ ఊసే లేదు
తరగతి గదులలో హాజరు నమోదు వేయలేదు
హాజరైన అధ్యాపకులు
ఒక్కో కళాశాలకు ఒకరూ ఇద్దరే
తిరుపతి సిటీ: జిల్లాలో జూనియర్ కళాశాలల పునఃప్రారంభమైన తొలిరోజు బుధవారం తరగతులు వెలవెలబోయాయి. జూనియర్ కళాశాలల పునఃప్రారంభంపై ఇటు విద్యార్థులకు, అటు ప్రభుత్వాధికారులు అవగాహన కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. నూతన విద్యా విధానంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ 2026–27 విద్యా సంవత్సరం బుధవారం నుంచి ప్రారంభమైంది. మార్చి 25తో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ముగిసిన నేపథ్యంలో తిరిగి కేవలం వారం రోజుల్లోనే రెండో ఏడాది విద్యార్థులకు తరగతులు ప్రారంభమయ్యాయి. తొలిరోజు బుధవారం కళాశాలలు వెలవెల బోయాయి. జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో కనీసం 2 శాతం సైతం విద్యార్థుల హాజరు మించకపోవడం విశేషం. హాజరైన విద్యార్థులకు కనీసం మధ్యాహ్న భోజనం సైతం అందించడంలో అధికారులు విఫలమయ్యారు. నూతన సీబీఎస్ఈ సిలబస్ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఇప్పటి వరకు విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేయలేదు.
జిల్లాకు చేరని పుస్తకాలు
ప్రభుత్వ యాజమాన్యాలకు చెందిన కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు కళాశాల ప్రారంభం రోజున ఉచితంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం కింద ఉచితంగా కిట్లను పంపిణీ చేస్తామని ఊదరగొట్టిన ప్రభుత్వం ఇప్పటి వరకు జిల్లాలో ఆ ఊసే ఎత్తలేదు. జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు అవసరైన నోటు పుస్తకాలు, టెక్ట్స్ పుస్తకాలు, రికార్డుల కోసం ఇప్పటికే ఇంటర్మీడియట్ అధికారులు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులకు ఇండెంట్ పెట్టారు. కానీ వీటిలో ఒకటి కూడా ఇప్పటి వరకు జిల్లాకు చేరలేదు.
విద్యార్థులు లేక తరగతులు వెలవెల!
తొలిరోజు 2 శాతం హాజరు
జిల్లాలో 21 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 29 హైస్కూల్ ప్లస్, 6మోడల్ స్కూళ్లు, ఏపీఆర్జేసీ ఒకటి, ఎయిడెడ్ ఒకటి, 10 ఏపీఎస్డబ్ల్యూఆర్, 3 ట్రైబల్ వెల్ఫేర్, రెండు ఏంజేపీఏఆర్బీసీడబ్ల్యూఆర్ కళాశాలలు ఉన్నాయి. వీటితో పాటు టీటీడీకి చెందిన మూడు జూనియర్ కళాశాలలో బుధవారం ప్రారంభమయ్యాయి. ఇంటర్ సెకండ్ ఇయర్ తరగతులకు కేవలం రెండు శాతం విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. సుమారు 18 పైగా కళాశాలలో తరగతి గదులకు తాళాలు సైతం తెరవకపోవడం ఆశ్చర్యకరం.
సార్లు రాలేదు...మధ్యాహ్న భోజనం పెట్టలేదు
ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి క్లాసులు ప్రారంభమవుతాయని చెప్పారు. సార్లు ఒకరో ఇద్దరో వచ్చారు. విద్యార్థులు తరగతికి ఇద్దరు, ముగ్గురు హాజరయ్యారు. తొలిరోజు కళాశాలలు బోసిపోయాయి. విద్యార్థులకు పరీక్షలు జరిగిన పదిరోజులు కాకముందే సెకండ్ ఇయర్ తరగతులను ప్రారంభించడంలో అర్థం లేదు. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో కళాశాలలు ప్రారంభించడం అవసరమా?. ప్రభుత్వం ఆనాలోచిత చర్యలతో విద్యార్థులు సతమతమవుతున్నారు. కళాశాలకు వచ్చిన విద్యార్థులను పట్టించుకునే నాథుడే కరువయ్యారు. మధ్యాహ్న భోజనం పెట్టలేదు. పిల్లలు నేరుగా ఇంటికి వచ్చి భోజనం చేశారు.
– విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదన


