
ప్రస్తుతం రాష్ట్రంలో చురుకుగా రుతుపవనాల కదలికలు
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
3 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు క్రమంగా ఊపందుకునే సూచనలు కన్పిస్తున్నాయి. ప్రస్తుతం వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వేసవి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి చల్లదనం సంతరించుకుంటోంది. ఈ క్రమంలో ప్రస్తుతం రుతుపవనాల కదలికలు ఆశాజనకంగా ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వాస్తవానికి రుతుపవనాలు వచ్చినప్పటికీ గత పది రోజులుగా మందగించడంతో వానల జాడ లేకుండా పోయింది.
అక్కడక్కడా అడపాదడపా తేలికపాటి వర్షాలు నమోదైనప్పటికీ..వాతావరణంలో నెలకొన్న మార్పులతో అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత తీవ్ర ఉక్కిరిబిక్కిరికి గురిచేశాయి. కానీ ప్రస్తుతం పరిస్థితి మారుతోంది. రుతుపవనాల కదలికలు చురుగ్గా మారుతుండటంతో పాటు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో రానున్న మూడు రోజులు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు tకురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. వికారాబాద్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఇతర జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
మాటూర్లో 4.93 సెం.మీ. వర్షం
బుధవారం రాష్ట్రంలో సగటున 7.9 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఈ సీజన్లో 11 రోజుల్లో 3.37 సెంటీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా.. బుధవారం సాయంత్రానికి 2.35 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అత్యధికంగా నల్లగొండ జిల్లా మాటూర్లో 4.93 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నాగర్కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లిలో 4.35, నల్లగొండ జిల్లా ముదిగొండలో 3.38, పడమటిపల్లెలో 3.10, తిమ్మాపూర్లో 3 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గాయి. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే 5 డిగ్రీ సెల్సీయస్ తక్కువగా నమోదయ్యాయి. ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. గరిష్ట ఉష్ణోగ్రత అదిలాబాద్లో 33.8 డిగ్రీ సెల్సీయస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్లో 20 డిగ్రీ సెల్సీయస్ నమోదైంది. రానున్న మూడు రోజులు కూడా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.