తటాక తీరంలో ఆనంద విహారం

Telangana Minister KTR To Inaugurate Gandipet Park - Sakshi

నేడు గండిపేట పార్కు ప్రారంభం  

కొత్వాల్‌గూడ ఎకో పార్కుకు శంకుస్థాపన  

హాజరు కానున్న మంత్రి కేటీఆర్‌  

సాక్షి, హైదరాబాద్‌:  చారిత్రక ఉస్మాన్‌సాగర్‌ వందేళ్ల ఉత్సవాల్లో భాగంగా గండిపేట తీరంలో ఏర్పాటు  చేసిన సువిశాలమైన లాండ్‌స్కేప్‌ పార్కును మంత్రి కేటీఆర్‌ మంగళవారం ప్రారంభించనున్నారు. అలాగే కొత్వాల్‌గూడ ఎకో పార్కుకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. సుమారు రూ.35.6 కోట్లతో 5.5 ఎకరాల విస్తీర్ణంలో హెచ్‌ఎండీఏ గండిపేట్‌ పార్కును అభివృద్ధి చేసింది.

ఈ పార్కులో ఓపెన్‌ఎయిర్‌ థియేటర్‌ ప్రత్యేకమైన ఆకర్షణ. చక్కటి సీటింగ్‌ సదుపాయంతో ఉండే ఈ థియేటర్‌ పర్యాటకులకు గొప్ప అనుభూతిని ఇవ్వనుంది. హైదరాబాద్‌ చారిత్రక, సాంస్కృతిక విశేషాలను, ప్రత్యేకతలను ఈ థియేటర్‌లో ప్రదర్శిస్తారు. పార్కు అందాలను ద్విగుణీకృతం చేసేలా స్వాగత ద్వారాన్ని భారీ ఆకృతిలో నిర్మించారు.  సెంట్రల్‌ పెవిలియన్, ఎంట్రన్స్‌ ప్లాజా, టికెట్‌ కౌంటర్, గార్డు రూమ్‌ తదితర సదుపాయాలు ఉన్నాయి. 

సందర్శకులతో పాటు వాకింగ్‌కు వచ్చేవారి కోసం నడక దారులు ఏర్పాటు చేయనున్నారు. పార్కులో హరివిల్లులను తలపించే రంగురంగుల ఫ్లవర్‌ టెర్రస్‌లు సందర్శకులకు కనువిందు చేస్తాయి. ఈ పార్కులో పిల్లలు ఆడుకొనే రకరకాల  పరికరాలను కూడా అందుబాటులో ఉంచారు. పిక్నిక్‌ జోన్‌లో పుట్టిన రోజు వంటి వేడుకలు చేసుకోవచ్చు.

ఉస్మాన్‌సాగర్‌ సమీపంలో 85 ఎకరాల విస్తీర్ణంలో హెచ్‌ఎండీఏ ఏర్పాటు చేసిన కొత్వాల్‌గూడ ఎకో పార్కును సుమారు రూ.75 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. ఈ పార్కులో 6 ఎకరాల్లో పక్షుల ఆవాసం (బర్డ్స్‌ అవేరి), రెండున్నర కిలోమీటర్ల బోర్డు వాక్, పాత్‌వేస్, ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్, ఓఆర్‌ఆర్‌ను అనుసంధానం చేసే బ్రిడ్జీలు, ఫుడ్‌కోర్టులు, విలాసవంతమైన కుటీరాలు, సమావేశ మందిరం వంటివి ఏర్పాటు చేయనున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top