
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో సీఎం రేవంత్ రెడ్డి ఊరట దక్కింది. గచ్చిబౌలి పీఎస్లో ఆయనపై నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేసింది.
ప్రస్తుత సీఎం 2016లో అప్పటి మల్కాజ్గిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలంలో ఐటీ హబ్గా పేరొందిన గచ్చీబౌలీకి సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గోపన్నపల్లీలో 31 ఎకరాల హౌసింగ్ సొసైటీ భూమూల్ని ఆక్రమించుకునేందుకు రేవంత్ రెడ్డి, అతని సోదరుడు కొండల్ రెడ్డితో పాటు అతని అనుచరులు ప్రయత్నించారంటూ ఫిర్యాదులందాయి.
ఆ ఫిర్యాదుల్లో రేవంత్రెడ్డి, అతని సోదరుడు,అనుచురులు ఎలాంటి హక్కులు, అనుమతులు లేకుండా వివాదాస్పద సొసైటీ భూముల్ని వినియోగించుకునేందుకు ప్రయత్నించారని, సొసైటీ సభ్యుల్ని బెదిరించడం, భూములతో సంబంధం ఉన్నవారిని దూషించారంటూ పేర్కొన్నారు.
బాధితుల ఫిర్యాదు మేరకు గచ్చీబౌలీ పోలీసులు రేవంత్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. భూముల వివాదానికి సంబంధించి కోర్టులో ఛార్జ్షీట్ కూడా దాఖలైంది. హైకోర్టు విచారణ చేపట్టింది. సొసైటీ భూముల వ్యవహారంలో తమ ప్రమేయం లేదని, రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్దేశపూర్వకంగా తనపై కేసు నమోదు చేశారని రేవంత్ తరుపు న్యాయవాదులు కోర్టులో వాదించారు.
అదే కేసులో 2019లో కోర్టులో రేవంత్ మరో ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి న్యాయ విచారణ నిలిపివేయాలని కోరుతూ రేవంత్ వాదనలు వినిపించారు. రేవంత్ తరుపు వాదనలు విన్న కోర్టు ఎటువంటి అధికారిక అభియోగాలు మోపలేదు.
దీనికి ప్రతిస్పందనగా, హౌసింగ్ సొసైటీ తరపు న్యాయవాదులు ఈ కేసులో రేవంత్ తన రాజకీయ పలుకుబడిని ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు సొసైటీ భూముల వివాదంపై రిపోర్టును తయారు చేసి ట్రయల్ కోర్టులో సబ్మిట్ చేయాలంటూ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈ కేసు విచారణ కొనసాగుతున్న సమయంలో 2020లో రేవంత్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. సొసైటీ భూముల వివాదంలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై గత జూన్ 20న విచారణ చేపట్టిన కోర్టు తీర్పును జులై 17కి రిజర్వు చేసింది. ఇవాళ కోర్టులో జరిగిన విచారణలో.. సంఘటనా జరిగిన సమయంలో రేవంత్ రెడ్డి అక్కడ లేరని దర్యాప్తులో తేలిందని హైకోర్టు తెలిపింది. ఫిర్యాదు దారు చేసిన ఆరోపణల్లో సరైన సాక్ష్యాధారాలు లేవని పేర్కొంది. గచ్చిబౌలి పీఎస్లో ఆయనపై నమోదైన క్రిమినల్ కేసులను కొట్టివేసింది.