
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చేతికి హైదరాబాద్ మెట్రో మొదటి దశ ప్రాజెక్టు దక్కింది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఎల్అండ్ సీఎండీ మధ్య అంగీకారం కుదిరింది. ఈ మేరకు మెట్రో మొదటి దశ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. ఎల్ అండ్ టీ కి ఉన్న రూ.13వేల కోట్ల అప్పును రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.
ఈ ఒప్పందం మేరకు ఎల్అండ్ టీకి రూ.2,100 కోట్లు నగదు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమయ్యింది. ఇకపై హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణ నుంచి ఆ సంస్థ వైదొలగనుంది. హైదరాబాద్ మెట్రో 69 కి.మీ. మొదటి దశను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో రూ.22 వేల కోట్లతో మెట్రో నిర్మించింది. రెండో దశ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం ఫేజ్-2ఏ అండ్ 2బీలో 163 కి.మీ. కొత్త మెట్రో లైన్లు ప్రతిపాదించింది. ఫేజ్-2 అప్రూవల్ కోసం ఎల్ అండ్ టీ తో డిఫినిటివ్ అగ్రిమెంట్ సంతకాన్ని కేంద్రం కోరింది. కాగా ఎల్ అండ్ టీ.. ఫేజ్-2లో ఈక్విటీ పార్టనర్గా పాల్గొనలేమని స్పష్టం చేసింది. తమ ఈక్విటీ వాటాను రాష్ట్రం లేదా సెంటర్ కొనుగోలు చేసుకోవచ్చని సూచించింది. ఈ నేపధ్యంలో సీఎం రేవంత్ రెడ్డి – ఫేజ్-1, ఫేజ్-2 ఆపరేషనల్ ఇంటిగ్రేషన్ కోసం సంస్థకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం – ఫేజ్-1 ప్రాజెక్ట్ మొత్తం టేకోవర్ చేయాలని ప్రతిపాదించింది. ఫేజ్-1 ప్రాజెక్ట్ అప్పు రూ.13 వేల కోట్లు రాష్ట్రం భరిస్తుందని అంగీకారం తెలిపింది. ఈక్విటీ విలువ రూ.2 వేల కోట్లను ఎల్ అండ్ టీకి చెల్లింపునకు ప్రతిపాదించింది. ఈ టేకోవర్ షరతులు పరస్పర చర్చలతో ఒక కొలిక్కి రానున్నాయి.