Telangana Formation Day: రాష్ట్రాన్ని పునర్నిర్మించే ప్రయత్నం చేస్తున్నాం | Telangana Formation Day: CM Revanth At Gun Park, Parade Grounds Updates | Sakshi
Sakshi News home page

Telangana Formation Day: రాష్ట్రాన్ని పునర్నిర్మించే ప్రయత్నం చేస్తున్నాం

Jun 2 2025 9:46 AM | Updated on Jun 2 2025 11:56 AM

Telangana Formation Day: CM Revanth At Gun Park, Parade Grounds Updates

హైదరాబాద్, సాక్షి: దశాబ్దాల పోరాటంతో తెలంగాణను సాధించుకున్నామని.. పదేళ్ల తర్వాత తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి (Anumula Revanth Reddy) అన్నారు. సోమవారం సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో(Telangana Formation Day Celebrations) పాల్గొని ఆయన ప్రసంగించారు.

‘‘దశాబ్దాల పోరాటంతో తెలంగాణను సాధించుకున్నాం. రాష్ట్రం వచ్చి పదేళ్లు అయినా ఆకాంక్షలు నెరవేరలేదు. జరిగిన తప్పిదాలను సరిదిద్ది రాష్ట్రాన్ని గాడిన పెడుతున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్నాం. ఇది సకల జనుల ఆకాంక్షలు నెరవేరిన రోజు.  

తెలంగాణ సమాజానికి మహిళలే పునాది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నాం. పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తోంది.

ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేశాం. రూ.2 లక్షల రైతురుణమాఫీ చేసి రుణవిముక్తులను చేశాం. రైతులు ఆత్మగౌరవంగా బతికేలా చేశాం. తెలంగాణ వరిధాన్యం ఉత్పత్తి రికార్డు స్థాయిలో పెరిగింది. రైతులు దళారుల బారిన పడకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 8వేల కొనుగోలు కేంద్రాలను తీసుకొచ్చాం. భూభారతి చట్టం తీసుకొచ్చాం. ధరణి కొందరికి చుట్టమైతే.. భూభారతి ప్రజలకు రక్షణ. 

ఒలింపిక్స్‌లో మన దేశానికి అనుకున్నంత స్థాయిలో పథకాలు రాలేదు. మట్టిలో మాణిక్యాలను తయారు చేసేందుకు స్పోర్ట్స్‌ అకాడమీ తీసుకొచ్చాం. వచ్చే ఒలింపిక్స్‌లో తెలంగాణ నుంచి బంగారు పతకం తేవడమే మా లక్ష్యం. పేదల ఆరోగ్యం మా ప్రభుత్వ బాధ్యత. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నాం. ఇప్పటిదాకా 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించాం. ఏడాదిలో 60 వేల ఉద్యోగాలు కల్పించాం. ప్రతి నియోజకవర్గానికి యంగ్‌ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌కు శ్రీకారం చుట్టాం. సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతున్న వాళ్లకు ఆర్థిక సాయం అందిస్తున్నాం. విద్య మీద పెట్టేది ఖర్చు కాదు.. భవిష్యత్‌ పెట్టుబడి’’ అని సీఎం రేవంత్‌ ప్రసంగించారు.

ప్రసంగానికి ముందు జాతీయ జెండాను ఆవిష్కరించిన ఆయన.. పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రేవంత్‌ కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. అంతకు ముందు..

గన్ పార్క్‌లో అమరవీరుల స్థూపానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నివాళులర్పించారు. ఈ వేడుకలో పలువురు మంత్రులు పాల్గొన్నారు. మరోవైపు రాజ్‌భవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ.. తెలంగాణ అభివృద్ధి కొనసాగాలని ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement