Supreme Court Key Verdict on Telangana Manchirevula Lands - Sakshi
Sakshi News home page

Manchirevula Lands: కేసీఆర్‌ సర్కార్‌కు ఊరట.. మంచిరేవుల భూములపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

Aug 1 2023 2:25 PM | Updated on Aug 1 2023 4:38 PM

Supreme Court Key Verdict on Telangana Manchirevula Lands - Sakshi

న్యూఢిల్లీ: మంచిరేవుల భూముల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. 143 ఎకరాల మంచిరేవుల భూములపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. ఓఆర్‌ఆర్‌కు ఆనుకొని ఉన్న అసైన్డ్‌ భూములు తెలంగాణ ప్రభుత్వం, గ్రే హౌండ్స్‌కే చెందుతాయని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. కాగా 143 ఎకరాల అసైన్డ్ భూమిని 1993లో ప్రైవేట్ వ్యక్తులు అక్రమంగా విక్రయించి ప్లాట్‌లుగా మార్చారు. రాష్ట్ర ప్రభుత్వం 1977 అసైన్‌మెంట్ చట్టం ప్రకారం వారికి నోటీసులు జారీ చేసింది. 

ఈ నోటీసులపై ఆక్రమణదారులు హైకోర్టును ఆశ్రయించగా.. ఈ భూములు ప్రైవేటు వ్యక్తులకే చెందుతాయని హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ..2021లో డివిజన్‌ బెంచ్‌లో ప్రభుత్వం సవాలు చేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ను అనుమతించి.. సింగిల్‌ జడ్జి తీర్పును తెలంగాణ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ పక్కన పెట్టేసింది.

దీంతో హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన ఆదేశాలను ఆక్రమణ దారులు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఈ పిటిషన్‌పై నేడు విచారణ జరగ్గా.. ప్రైవేటు వ్యక్తుల పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇకపై ఈ భూముల విషయంలో కిందస్థాయి కోర్టులు, హైకోర్టులు ఎలాంటి జోక్యం చేసుకునే అధికారం లేదని సుప్రీం తేల్చి చెప్పింది. ఇప్పుడు తాము ఇచ్చిన ఆదేశాలే ఫైనల్‌ అని, ఇకపై ఎలాంటి జోక్యాలు అనుమతించేది లేదని స్పష్టం చేసింది.

పోలీసు విభాగంలోని గ్రేహౌండ్స్‌కు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు సరైనవే అని, అవి చట్టబద్ధమైనవని జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తల ధర్మాసనం తీర్పులో స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం తరపున న్యాయవాది శ్రీహర్ష తుది వాదనలు వినిపించారు.
చదవండి: 108కు కొత్త వాహనాలు.. ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement