కొత్త కోర్సుల్లేవా దోస్త్‌? | Students Confusion Over DOST In Telangana | Sakshi
Sakshi News home page

కొత్త కోర్సుల్లేవా దోస్త్‌?

Jun 5 2026 6:08 AM | Updated on Jun 5 2026 6:08 AM

Students Confusion Over DOST In Telangana

మండలి, సాంకేతిక విద్య అధికారుల పంచాయితీ

డిగ్రీలో ఎమర్జింగ్‌ కోర్సులపై వర్సిటీల నుంచి అందని బీవోఎస్‌ అనుమతులు

ఇంజనీరింగ్‌కు దీటుగా కోర్సుల రూపకల్పనపై వివాదం

‘దోస్త్‌’ గడువు సమీపిస్తుండటంతో విద్యార్థుల్లో అయోమయం

సాక్షి, హైదరాబాద్‌: ఉన్నత విద్యా  మండలి ప్రతిపాదించిన కొత్త కోర్సులు ఈ ఏడాది అందుబాటులోకి వచ్చే అవకాశం కన్పించడం లేదు. మండలి, సాంకేతిక విద్య అధికారుల మధ్య వివాదమే దీనికి ప్రధాన కారణం. ఇంజనీరింగ్‌ విద్యకు సమాంతరంగా మండలి రూపొందించిన కోర్సులను సాంకేతిక విద్య కమిషనరేట్‌ ఆపివేసింది. డిగ్రీ ద్వారా ఈ కోర్సులు చేయడం వల్ల అతి తక్కువ ఖర్చుతోనే అత్యధిక వేతనంతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు పొందే వీలుంది. అంతర్జాతీయంగా బహుళ జాతి కంపెనీల్లోనూ పేద విద్యార్థులు ఉద్యోగాలు పొందేలా రూపొందించారు.

ఈ కోర్సులపై ఏడాదిగా ఉన్నత విద్యా మండలి విస్తృత ప్రచారం చేపట్టింది. రూ. లక్షలు వెచ్చించి ఇంజనీరింగ్‌లో యాజమాన్య కోటా సీటు పొందేకన్నా ఎమర్జింగ్‌ కోర్సులున్న డిగ్రీ విద్యను ఎంచుకోవాలని విద్యార్థులు సైతం ఆశపడ్డారు. వీటివల్ల బహుళజాతి సంస్థల్లో మంచి ఉద్యోగావకాశాలు వస్తాయని భావించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉన్నత విద్యా మండలి ద్వారా కోర్సుల వివరాలను విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఆసక్తి చూపడంతో అన్ని విశ్వవిద్యాలయాల వీసీలతో మండలి చైర్మన్‌ సమావేశం ఏర్పాటు చేసి కోర్సుల నిర్వహణకు ఒప్పించారు.

బీవోఎస్‌ అనుమతులు ఆపిందెవరు?
కొత్త కోర్సులు, సిలబస్‌ను రూపొందించేప్పుడు ప్రతీ యూనివర్సిటీ పరిధిలోని బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ (బీవోఎస్‌) ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఇందులో విశ్వవిద్యాలయం అధికారులతో పాటు బయట నుంచి పారిశ్రామిక నిపుణులు, వ్యాపారవేత్తలూ ఉంటారు. పరిశ్రమలకు అవసరమైన రీతిలో సిలబస్, కోర్సుల రూపకల్పనపై ఈ బోర్డు చర్చిస్తుంది. కోర్సులపై ఏడాదిగా కసరత్తు జరుగుతున్నా, యూనివర్సిటీలు మాత్రం బీవోఎస్‌ సమావేశాలు నిర్వహించలేదు. ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి కారణంగానే తాము ముందుకు వెళ్ళడం లేదని పలు వర్సిటీల వీసీలు తెలిపారు.

ఈ విషయమై ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ కుమార్‌ మొలుగరంను వివరణ కోరగా బీవోఎస్‌లోని సభ్యులు వివిధ కారణాల వల్ల అందుబాటులో లేరని, అందుకే సమావేశం నిర్వహించలేదని తెలిపారు. ఇది సహేతుక కారణమే కాదని, సాంకేతిక విద్య అధికారుల ఒత్తిడే దీని వెనుక పని చేసిందని మండలి వర్గాలు అంటున్నాయి. అయితే కొన్ని వర్సిటీల నుంచి బీవోఎస్‌ అనుమతులు వచ్చాయని, వీటిని విద్యాశాఖ ఉన్నతాధికారులకు పంపామని మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ బాలకిష్టారెడ్డి తెలిపారు. డిగ్రీ కోర్సుల ప్రవేశానికి నిర్వహించే దోస్త్‌ రెండో ఫేజ్‌ ఇప్పటికే పూర్తయింది. మూడో విడత నడుస్తోంది. ఇది కూడా ఈ నెల 16తో ముగుస్తుంది. అయినా కొత్త కోర్సులపై పంచాయితీ ఇప్పటికీ తెగకపోవడం, ఆన్‌లైన్‌లోకి ఇవి రాకపోవడంతో విద్యార్థులు అయోమయంలో ఉన్నారు.

ఇంజనీరింగ్‌కు దీటుగా..
డేటాసైన్స్, ఏఐఎంఎల్, డిజిటల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్, సైబర్‌ సెక్యూరిటీ (ఆనర్స్‌) వంటి కోర్సులను డిగ్రీలో ప్రతిపాదించారు. వీటి బోధన ప్రణాళిక మొత్తం ఇంజనీరింగ్‌ విద్యతో సమానంగా రూపొందించారు. శరవేగంగా దూసుకొస్తున్న ఇ–కామర్స్‌ కోసం ఫైనాన్స్‌ టెక్నాలజీతో పాటు, డిజిటల్‌ మార్కెటింగ్‌ వంటి కోర్సులను సైతం ప్రతిపాదించారు. ఈ మేరకు ఏడాదిగా కసరత్తు చేసిన ఈ కోర్సులను ఆపలేమని కౌన్సిల్‌ చెప్పడంతో సాంకేతిక విద్య ఉన్నతాధికారి బీవోఎస్‌ నివేదికలు ఇవ్వొద్దని వీసీలపై ఒత్తిడి చేసినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ప్రైవేటు కాలేజీల నుంచి భారీగా ముడుపులు అందాయనే ఆరోపణలు కూడా వస్తున్నాయి.

అసలు కారణం ఏమిటి?
ఇంజనీరింగ్‌ ఫీజులు భారీగా పెరిగాయి. యాజమాన్య కోటా సీట్లు రూ. 10 నుంచి రూ. 20 లక్షల వరకూ పలుకుతున్నాయి. ప్రస్తుతం ఉన్న సంప్రదాయ డిగ్రీ కోర్సుల వల్ల ఉపాధి అవకాశాలు అంతగా ఉండటం లేదు. తాజాగా మండలి ప్రతిపాదించిన కొత్త కోర్సులు ఇంజనీరింగ్‌ విద్యకు దీటుగా, మెరుగ్గా ఉండే వీలుంది. అందువల్ల విద్యార్థులు డిగ్రీ కోర్సులకు వెళ్తే ఇంజనీరింగ్‌ బీ కేటగిరీ సీట్లు నిండటం కష్టం. దీంతో యాజమాన్యాలు లాబీయింగ్‌ చేసి కోర్సులు ఆపాయనే ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీలతో సాంకేతిక విద్య అధికారులు సంప్రదింపులు జరపడం, కౌన్సిల్‌పై కోర్సులు ఆపమని ఒత్తిడి చేయడం వివాదానికి కారణమైంది. 

Advertisement
 
Advertisement
Advertisement