
మీకు తెలుసా?
నిజామాబాద్(బోధన్): వీరన్నగుట్ట గ్రామానికి ఆ పేరు రావడానికి ఓ చరిత్ర ఉంది. నాలుగు వందల సంవత్సరాల కిందట గుట్టమీద ఉన్న బండరాయి పగిలి రెండుగా విడిపోగా వాటి మధలో వీరభద్రస్వామి విగ్రహం బయటపడినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. అప్పటి నుంచి చుట్టుపక్కల గ్రామాల భక్తులు ఆలయంలో పూజలు ప్రారంభించారు. కొంతకాలానికి బోధన్ షుగర్ ఫ్యాక్టరీ భూముల్లో చెరుకు నరికేందుకు పలు ప్రాంతాలకు చెందిన కూలీలు వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు.
ముందుగా సాటాపూర్ ఫారంగా పంచాయతీ ఏర్పాటైంది. కాలక్రమేణ జనాభా పెరగడంతో వీరన్నగుట్టగా దేవుడిపేరుతో గ్రామానికి పేరు వచ్చింది. ప్రతి సంవత్సరం మహా శివరాత్రి జరిగిన మూడో రోజు ఇక్కడి ఆలయంలో రథోత్సవం, జాతరను వైభవంగా నిర్వహిస్తారు. భక్తుల కొంగు బంగారంగా వీరభద్రుడు విరాజిల్లుతున్నాడు.