తెలంగాణలో రూ.500 కోట్లతో పోకర్ణ ప్లాంటు | Pokarna Sets up RS 500 Cr Plant in Hyderabad | Sakshi
Sakshi News home page

తెలంగాణలో రూ.500 కోట్లతో పోకర్ణ ప్లాంటు

Jul 30 2021 7:21 PM | Updated on Jul 30 2021 7:23 PM

Pokarna Sets up RS 500 Cr Plant in Hyderabad - Sakshi

హైదరాబాద్‌: క్వాంట్రా క్వార్జ్‌ బ్రాండ్‌ పేరుతో ప్రీమియం క్వార్జ్‌ సర్ఫేసెస్‌ తయారీలో దేశంలో అతిపెద్ద సంస్థ పోకర్ణ ఇంజనీర్డ్‌ స్టోన్‌ హైదరాబాద్‌ సమీపంలో కొత్త ప్లాంటును నెలకొల్పింది. అంతర్జాతీయ స్థాయిలో నిర్మించిన ఈ అత్యాధునిక కేంద్రం కోసం కంపెనీ రూ.500 కోట్లు పెట్టుబడి చేసింది. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు ఈ ఫెసిలిటీని జూలై 31న ప్రారంభించనున్నారు. మేకగూడ వద్ద 1,60,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 90 లక్షల చదరపు అడుగుల వార్షిక తయారీ సామర్థ్యంతో  దీనిని స్థాపించారు. ఈ తయారీ కేంద్రం ద్వారా 500 మందికి ఉద్యోగావకాశాలు దక్కాయి. 

పరోక్షంగా 3,000 మందికి ఉపాధి లభించనుంది. ఈ ఏడాది మార్చి 24న ప్లాంటులో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని పోకర్ణ ఇంజనీర్డ్‌ స్టోన్‌ సీఎండీ గౌతమ్‌ చంద్‌ జైన్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటలీకి చెందిన పేటెంటెడ్‌ బ్రెటన్‌స్టోన్‌ టెక్నాలజీని ఇక్కడ వినియోగిస్తున్నట్టు చెప్పారు. కొత్త కేంద్రం చేరికతో సంస్థ మొత్తం వార్షిక స్థాపిత సామర్థ్యం 1.5 కోట్ల చదరపు అడుగులకు చేరుకుందని సీఈవో పరాస్‌ కుమార్‌ జైన్‌ వెల్లడించారు. పూర్తి సామర్థ్యానికి చేరుకున్న తర్వాత ఈ కేంద్రం నుంచి రూ.400 కోట్ల టర్నోవర్‌ ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇక్కడ జంబో, సూపర్‌ జంబో సైజులో స్లాబ్స్‌ను తయారు చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అచ్యుతాపురం వద్ద ఉన్న ఏపీసెజ్‌లో 2009లో కంపెనీ క్వార్జ్‌ సర్ఫేసెస్‌ తయారీ కోసం తొలి ప్లాంటును స్థాపించింది.

Advertisement
 
Advertisement
Advertisement