అంచనాలకు మించి! | Over Rs 44 thousand crores spent in 10 months of 2025-26: Telangana | Sakshi
Sakshi News home page

అంచనాలకు మించి!

Feb 21 2026 3:38 AM | Updated on Feb 21 2026 3:40 AM

Over Rs 44 thousand crores spent in 10 months of 2025-26: Telangana

ప్రణాళిక పద్దు కింద వ్యయం.. అభివృద్ధికి, మౌలిక సదుపాయాలకు ఖర్చు 

2025–26 పది నెలల్లోనే రూ.44 వేల కోట్లకు పైగా వ్యయం 

మొత్తం ఏడాది బడ్జెట్‌ అంచనా రూ.36,504 కోట్లు మాత్రమే 

ఆర్థిక సంవత్సరంలో 2 నెలలు మిగిలి ఉండగానే రూ.8 వేల కోట్ల అదనపు వ్యయం 

ఏడాది ముగిసేసరికి రూ.50 వేల కోట్లకు చేరే అవకాశం ఉందంటున్న ఆర్థిక శాఖ వర్గాలు 

మంచి పరిణామమే అని, ఆర్థిక వ్యవస్థ సానుకూలతకు సూచిక అంటున్న నిపుణులు 

జనవరి 31 నాటికి ఖజానాకు రూ.2.07 లక్షల కోట్ల రాబడులు 

పెరిగిన పన్ను ఆదాయం.. రుణాల పద్దు

సాక్షి, హైదరాబాద్‌:  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రణాళిక పద్దు కింద ఖర్చు అంచనాలకు మించి జరుగుతోంది. 2025–26లో ప్రణాళిక వ్యయం కింద రూ.36,504 కోట్లు ఖర్చు పెడతామని రాష్ట్ర ప్రభుత్వం ఆ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ అంచనాల్లో ప్రతిపాదించింది. అయితే 2 నెలల ముందే, అంటే ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా 2 నెలల సమయం ఉండగానే రూ. 44,376.34 కోట్లు ఖర్చయ్యాయి. అంటే అంచనాలతో పోలిస్తే 125.53 శాతం వ్యయం అయ్యిందన్న మాట.

మిగతా 2 నెలలు ముగిసేసరికి అంటే ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఈ ఖర్చు రూ.50 వేల కోట్లకు చేరే అవకాశముందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల కల్పన కోసం పెట్టే ప్రణాళిక వ్యయం పెరగడం మంచి పరిణామమని, బడ్జెట్‌ అంచనాలకు మించి ఖర్చు చేయడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సానుకూలతను సూచిస్తోందని ఆర్థిక నిపుణులు చెపుతున్నారు.  

పెరుగుతున్న పన్ను ఆదాయం 
ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి మాసాంతానికి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రూ.2 లక్షల కోట్లకు పైగా నిధులు సమకూరాయి. పన్ను ఆదాయం, పన్నేతర ఆదాయం, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్, కేంద్ర పన్నుల్లో వాటాలతో పాటు బహిరంగ మిగతా మార్కెట్‌లో తెచ్చిన అప్పులు కలిపి రూ.2,07,558.18 కోట్లు వచ్చినట్టు కం్రప్టోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) గణాంకాలు చెబుతున్నాయి. అదే గత ఆర్థిక సంవత్సరం (2024–25) జనవరి మాసాంతానికి ఖజానాకు రూ.1,82,437.83 కోట్లు మాత్రమే సమకూరడం గమనార్హం.

అంటే ఆదాయం దాదాపు రూ.25 వేల కోట్లు పెరిగిందన్న మాట. పన్ను ఆదాయం రూ.14 వేల కోట్లు, అప్పులు రూ.9 వేల కోట్లు పెరిగిన నేపథ్యంలో ఈ మేరకు ఖజానాకు నిధులు వచ్చాయని కాగ్‌ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఆదాయ గణాంకాలను పరిశీలిస్తే.. పన్నుల రూపంలో 10 నెలల కాలంలో రూ.1,26,293.64 కోట్లు రాగా, గత ఏడాది రూ.1,12,772.48 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇక ఈ ఏడాది అప్పుల పద్దు కూడా పెరిగింది.

ఈ ఏడాది జనవరి 31 నాటికి బహిరంగ మార్కెట్‌లో రూ.69,148.28 కోట్ల మేర రుణాలను సమీకరించగా, గత ఏడాది ఇదే సమయానికి రూ. 58,586.75 కోట్ల అప్పులు మాత్రమే ప్రభుత్వం తీసుకువచ్చింది. ఇక ఖర్చుల విషయానికొస్తే.. జనవరి 31, 2026 నాటికి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి రూ.1,93,313.79 కోట్లు వ్యయం అయ్యాయి. అయితే గత ఏడాది 10 నెలల కాలంలో రూ.1,78,947.43 కోట్లు మాత్రమే ఖర్చు కావడం గమనార్హం. ఈ ఏడాది రెవెన్యూ పద్దు కింద రూ.1,48,937.45 కోట్ల ఖర్చు జరిగిందని కాగ్‌ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement