భవన నిర్మాణానికి అనుమతి కోరిన పది రాష్ట్రాలు
సాక్షి, హైదరాబాద్: ఫ్యూచర్ సిటీలో ఇతర రాష్ట్రాలు ఆయా ‘రాష్ట్ర ప్రభుత్వ భవనాల’ను నిర్మించుకోవడానికి స్థలాలు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే దాదాపు పది రాష్ట్రాలు హైదరాబాద్లో రాష్ట్ర భవనాలు నిర్మించుకోవడానికి అనుమతి కోరినట్లు సమాచారం. తెలంగాణ మాజీ గవర్నర్, ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ అయిన జిష్ణుదేవ్వర్మ ‘‘ఈశాన్యరాష్ట్రాలకు చెందిన వారు హైదరాబాద్లో నివసిస్తున్నారని, ఈశాన్యరాష్ట్రాలకు భవనాలు నిర్మించుకోవడానికి స్థలాలు కేటాయించాల’’ని అప్పట్లోనే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కోరారు.
ఆ మేరకు ప్రతి రాష్ట్రానికి ఎకరా భూమి కేటాయించాలని, అందుకోసం ఫ్యూచర్ సిటీలో 15 ఎకరాలను సిద్ధంగా ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, గుజరాత్ రాష్ట్రాలు ‘రాష్ట్ర భవనాలు’నిర్మించుకోవడానికి స్థలాలు అడిగినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా విజ్ఞప్తి చేసింది. కానీ ఇప్పటి వరకు ఏపీకి ఎలాంటి కేటాయింపులు చేయలేదు.
డేటా సెంటర్లకు వెయ్యి ఎకరాలు
ఫ్యూచర్ సిటీలో డేటాసెంటర్ల ఏర్పాటు కోసం దాదాపు వెయ్యి ఎకరాలు కేటాయించినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. అమెజాన్ ప్రధాన డేటాసెంటర్కు ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. ఫ్యూచర్ సిటీలో పరిశ్రమలకు కేటాయింపులు కొనసాగుతున్నాయని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుతోపాటు నగర విస్తరణకు కావాల్సినంత భూమి ఆ పరిసరాల్లోనే ఉందని, అది అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు అనువైన ప్రాంతంగా ఉంటుందని ఆ అధికారి వివరించారు. సింగపూర్కు చెందిన జూరాంగ్ సంస్థ ఈ ప్రాంతానికి మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఇచి్చందని, దానికి మంత్రివర్గం ఆమోదం తెలపాల్సి ఉందని ఓ అధికారి తెలిపారు.


