ఓపెన్‌ విద్యార్థులందరూ పాస్‌  | Sakshi
Sakshi News home page

ఓపెన్‌ విద్యార్థులందరూ పాస్‌ 

Published Sat, Jul 25 2020 3:52 AM

Open Education Students Are Promoted By The Telangana Government - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ నిర్వహిస్తున్న దూరవిద్యా ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్‌ విద్యా ర్థులంతా పాస్‌ అయ్యారు. అందరికీ ప్రతి సబ్జెక్టులో 35 శాతం కనీస పాస్‌ మార్కు లను ఇచ్చి ఉత్తీర్ణులను చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి చిత్రారామచంద్రన్‌ శుక్రవారం జీవో 12ను జారీ చేశారు. కరోనా కారణంగా గత ఏప్రిల్‌/మే నెలల్లో నిర్వహించాల్సిన ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి. ప్రస్తుత పరిస్థితుల్లోనూ పరీక్షలు నిర్వహించే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఎలా ముందుకు సాగాలన్న విషయంలో విద్యాశాఖ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయిం తీసుకుంది. పరీక్షలు రాసేందుకు అర్హత కలిగిన విద్యార్థులందరికీ కనీస పాస్‌ మార్కులను ఇస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో వెల్లడించింది.

ప్రతి సబ్జెక్టులో 35 శాతం మార్కులతో ఉత్తీర్ణులైనట్లు ప్రకటించింది. ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్‌లో అదనపు సబ్జెక్టు, ప్రాక్టికల్స్‌లోనూ 35 శాతం మార్కులతో పాసైనట్టేనని పేర్కొంది. ప్రస్తుతం కనీస పాస్‌ మార్కులతో పాసైన విద్యార్థులు తమ మార్కులను ఇంప్రూవ్‌ చేసుకోవాలనుకుంటే ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ తదుపరి నిర్వహించే పబ్లిక్‌ పరీక్షలకు హాజరుకావచ్చని వెల్లడించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 75 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి వెల్లడించారు. అందులో ఎస్సెస్సీ విద్యార్థులు 43 వేల మంది, ఇంటర్మీడియట్‌ విద్యార్థులు 32 వేల మంది ఉన్నట్లు తెలిపారు. కరోనా వల్ల పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.  

Advertisement
Advertisement