బండి సంజయ్‌ కుమారుడు భగీరథ్‌కు సిట్‌ నోటీసులు | A notice was issued to Bandi Bhagirath by the SIT team | Sakshi
Sakshi News home page

బండి సంజయ్‌ కుమారుడు భగీరథ్‌కు సిట్‌ నోటీసులు

May 12 2026 7:37 PM | Updated on May 12 2026 9:02 PM

A notice was issued to Bandi Bhagirath by the SIT team

సాక్షి,హైదరాబాద్‌: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు దర్యాప్తు ముమ్మరమైంది. సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాల మేరకు పర్యవేక్షణాధికారిగా నియమితులైన కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్‌ సిట్‌ బృందం బండి భగీరథ్‌కు నోటీసులు జారీ చేసింది.  పోక్సో కేసులో నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసుల్లో రేపు మధ్యాహ్నం 2గంటలకు పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో సిట్‌ విచారణకు హాజరు కావాలని సూచించింది.

భగీరథ్‌ను వెంట తీసుకుని రావాలని కరీంనగర్‌లో నివసించే అతని మేనమామ వంశీ కృష్ణకు పోలీసులు నోటీసులు పంపించారు. మరోవైపు బండి బగీరథ్ మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అభ్యర్థిస్తూ నేడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎల్లుండి విచారణకు రానుట్లు తెలుస్తోంది. 

భగీరథ్‌.. తన కుమార్తెను వేధిస్తున్నాడంటూ 17 ఏళ్ల బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్లో ఈ నెల 8న కేసు నమోదైన సంగతి తెలిసిందే. మరోవైపు ఆ బాలిక, ఆమె తల్లి తనను డబ్బు కోసం బెదిరిస్తున్నారంటూ భగీరథ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 8వ తేదీనే కరీంనగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు తర్వాత భగీరథ్‌ అజ్ఞాతంలోకి వెళ్లారు. 

సోమవారం (మే11,2026)న భగీరథ్ పోక్సో కేసు వ్యవహారంలో కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఈ మేరకు మెమో జారీ చేసింది. ‘‘సైబరాబాద్ కూకట్‌పల్లి జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రితిరాజ్ పెట్-బషీరాబాద్ పోలీస్ స్టేషన్ క్రైం నెం. 684/2026లో బీఎన్‌ఎస్ 74, 75 సెక్షన్లు, పోక్సో 12 సెక్షన్ కింద నమోదైన కేసు దర్యాప్తును వ్యక్తిగతంగా పర్యవేక్షించాల్సిందిగా కోరుతున్నాం.

దర్యాప్తు సరైన, నిష్పాక్షిక, వృత్తిపరమైన విధానంలో సాగేటట్లు చూసి, కేసుకు సంబంధించిన అన్ని అంశాలను నిర్లక్ష్యం లేకుండా, ఎటువంటి తప్పుదారి పట్టింపు లేకుండా పరిశీలించాల్సిందిగా ఆమెకు ఆదేశాలు ఇచ్చాం. దర్యాప్తు పురోగతిని డీసీపీ వ్యక్తిగతంగా పర్యవేక్షించి, ప్రతిరోజూ దర్యాప్తు నివేదికపై సంతకం చేసిన అధికారికి తప్పనిసరిగా సమర్పించాలి’’ అని పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement