మత్స్యశాఖ భవన్లో కనీసం హెల్ప్డెస్క్ లేదు
ఫిర్యాదు చేయాలంటే ఎవరిని కలవాలో తెలియని పరిస్థితి
రాష్ట్రంలో 4 లక్షల మంది మత్స్యకారులు..
ఇన్సూరెన్స్ గడువు ముగియడానికి మరో 10 రోజులే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మత్స్యకారుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, వాటి అమలుకు సంబంధించిన ప్రధాన కేంద్రంగా ఉన్న మత్స్యశాఖ భవన్లో కనీస హెల్ప్ డెస్క్ కూడా లేకపోవడం మత్స్యకారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. రాష్ట్ర నలుమూలల నుంచి తమ సమస్యల పరిష్కారంకోసం, పథకాలపై సమాచారం తెలుసుకోవాలని, బీమా, సభ్యత్వం, రిజి్రస్టేషన్ తదితర అంశాల కోసం కార్యాలయానికి వచ్చే మత్స్యకారులకు ఎక్కడికి వెళ్లాలి, ఎవరిని కలవాలి, ఏ శాఖను సంప్రదించాలనే విషయంపై స్పష్టమైన సమాచారం లేకపోవడంతో రోజంతా కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరణించిన మత్స్యకారుడి కుటుంబ సభ్యులు బీమా సొమ్ముకోసం సైతం ఎవరిని సంప్రదించాలో తెలియని పరిస్థితి. దీంతో ఇంటి పెద్ద లేకపోవడంతో అనేక కుటుంబాలు అప్పులపాలవుతున్నాయి.
ఎవరిని కలవాలో తెలియని పరిస్థితి
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4 లక్షల మంది మత్స్యకారులు, 6 వేలకుపైగా మత్స్యకార సహకార సంఘాలు ఉన్నాయి. ప్రతీరోజూ జిల్లా, మండలాల నుంచి పలువురు మత్స్యకారులు తమ సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్లోని మత్స్యశాఖ ప్రధాన కార్యాలయానికి వస్తుంటారు. అయితే కార్యాలయంలో ప్రజలకు మార్గనిర్దేశం చేసే రిసెప్షన్, హెల్ప్ డెస్్క, సమాచారం అందించే ప్రత్యేక కౌంటర్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏ అధికారి ఏ విభాగాన్ని చూస్తారో, ఏ సమస్యపై ఎవరిని కలవాలో అర్ధం కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు బిజీ... ప్రజలు వేచిచూడాల్సిందే
సంబంధిత అధికారులను కలవాలని ప్రయతి్నస్తే సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్లు, సమీక్షలు, ఇత ర అధికారిక కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారనే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోందని మత్స్యకారులు చెబుతున్నారు. గంటల తరబడి వేచిచూసినా అధికారులు అందుబాటులోకి రాకపోవడంతో, దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు సమస్యలు చెప్పుకోకుండానే వెనుదిరగాల్సి వస్తోందని వాపోతున్నారు.
ఇన్సూరెన్స్ గడువు సమీపంలో... ఆందోళనలో మత్స్యకారులు
మత్స్యకారులకు అత్యంత కీలకమైన బీమా పథకా నికి సంబంధించిన గడువు ముగియడానికి మరో 10 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో ఆందోళన మరింత పెరిగింది. బీమా పునరుద్ధరణ, కొత్త నమోదు, అవసరమైన పత్రాలు, ఆన్లైన్ నమోదు, సాంకేతిక సమస్యలు, అర్హతలపై స్పష్టత కోసం కార్యాలయానికి వచి్చన వారికి సరైన మార్గనిర్దేశనం లేకపోవడంతో గడువులోపే ప్రక్రియ పూర్తవుతుందా అనే సందేహం వ్యక్తమవుతోంది.
⇒ ప్రభుత్వం అనేక సేవలను ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకొచి్చనప్పటికీ, గ్రామీణ ప్రాంతాలకు చెందిన చాలామంది మత్స్యకారులకు డిజిటల్ సేవల వినియోగంపై అవగాహన తక్కువగా ఉంది. దీంతో చిన్నచిన్న సమస్యలకే ప్రధాన కార్యాలయానికి రావాల్సిన పరిస్థితి ఉంది. హెల్ప్డెస్క్ ఏర్పాటు చేసి ప్రత్యేక అధికారులను నియమిస్తే వేలాది మంది మత్స్యకారులకు ఊరట లభిస్తుంది.
- గంగపుత్ర సంఘం మహిళా అధ్యక్షురాలు స్వరూప


