ఆధునిక ఇస్ఫహాన్‌.. మన హైదరాబాద్‌ | Hyderabad was deliberately designed as Isfahan | Sakshi
Sakshi News home page

ఆధునిక ఇస్ఫహాన్‌.. మన హైదరాబాద్‌

Mar 23 2026 5:00 AM | Updated on Mar 23 2026 5:00 AM

Hyderabad was deliberately designed as Isfahan

ఇస్ఫహాన్‌ నగరంలోని మినార్‌ ఏ జొంబన్, ఇదే నిర్మాణ శైలితో మరింత ప్రత్యేకంగా రూపొందిన చార్మినార్‌

ఇజ్రాయెల్‌–అమెరికా దాడులతో ఇస్ఫహాన్‌ నగరం అతలాకుతలం

నగర నిర్మాణానికి డిజైన్‌ అదే.. 

అక్కడి నుంచి వచ్చిన ఆర్కిటెక్ట్‌ మీర్‌ మొమిన్‌దే కీలక పాత్ర

నగర నిర్మాణ బాధ్యత అప్పగించిన కులీకుతుబ్‌షా

40 ఏళ్లు ప్రధానమంత్రిగా బాధ్యతలు

ఇక్కడే మృతి.. మీర్‌ మొమిన్‌ కా దాయరాలో సమాధి

సాక్షి, హైదరాబాద్‌: ఇజ్రాయెల్‌–అమెరికాలు ఇరాన్‌ మీద దాడి ప్రారంభించినప్పటి కంటే ఓ నగరం మీద బాంబుల వర్షం కురిపించినప్పుడు ‘హైదరాబాద్‌ నగరం’మనసు కలుక్కుమనే ఉంటుంది. అక్కడి చారిత్రక నిర్మాణాలకు నష్టం వాటిల్లిందన్న విషయం తెలిసినప్పుడు మరింత ఆవేదనకు గురై ఉంటుంది. ఆ నగరమే ఇస్ఫహాన్‌. దాదా పు 3 వేల కి.మీ. దూరంలో ఉన్న ఆ నగరంపై బాంబులేస్తే హైదరాబాద్‌కు ఉలుకెందుకంటే... 22 ఆర్చి ద్వారాలతో అద్భుత శైలితో నిర్మితమైన పురానాపూల్, ఎత్తయిన నాలుగు మినార్లతో గంభీరంగా ఉండే చార్మినార్‌... షియా సంప్రదాయ కట్టడం బాద్‌షాహీ అషూర్‌ఖాన్‌... ఇవన్నీ ఆ ఇస్ఫహాన్‌ నగర ప్రభావంతో రూపొందినవే. వీటికి మూలం గోల్కొండ సామ్రాజ్య పేష్వాగా దశాబ్దాల పాటు కొనసాగిన మీర్‌ ముహమ్మద్‌ మొమిన్‌ అస్తరాబాదీ.

ఆయన మాట ల్లో... ‘హైదరాబాద్‌ అంటే ఆధునిక ఇస్ఫ హాన్‌’. ఆయ నకు ఇస్ఫహాన్‌ అంటే మక్కువ ఎందుకంటే.. ఆయనది ఇస్ఫహానే. ప్రస్తుతం ఇరాన్‌ ఇజ్రా యెల్‌–అమెరికా దాడులతో ఆ నగరం అతలా కుతల మవుతోంది. పర్షియన్‌ సంస్కృతి సంప్రదా యాలు, నిర్మాణాలను నిలువెల్లా అద్దుకున్న ఆ దేశం నిలువునా వణికిపోతోంది. ఎప్పుడు ఎక్కడి నుంచి ఏ మిసైల్‌ విధ్వంసం సృష్టిస్తుందోనని అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడుపుతున్నారు. కానీ, ఆ దేశంలో మూడో అతి పెద్ద నగరమైన ఇస్ఫహాన్‌కు నష్టం జరిగిందని తెలిసి హైదరాబాద్‌ గుండె బరువెక్కింది. ఇస్ఫహా న్‌తో ప్రస్తుతం హైదరాబాద్‌కు వాణిజ్య సంబంధాలు పెద్దగా లేకున్నా, హైదరాబాద్‌ పుట్టుకలో ఆ నగర ప్రభావమే కీలకం కావటం విశేషం.

కులీ కుతుబ్‌షా పాలనలో..
కులీకుతుబ్‌షాహీ పాలకుల్లో ఐదోవాడిగా పట్టాభిషిక్తుడైన మహమ్మద్‌ కులీకుతుబ్‌షా పాలనలో హైదరాబాద్‌ నగర నిర్మాణం మొద లైంది. అప్పటి వరకు గోల్కొండ పట్టణం ఒక్కటే ఉండేది. ప్రస్తుతం పాతనగరం ఉన్న ప్రాంతంలో కొన్ని ఊళ్లు మాత్రమే ఉండేది. నాలుగో రాజు ఇబ్రహీం కులీకుతుబ్‌షాహీ కాలంలోనే గోల్కొండ ఇరుకుగా మారటంతో మూసీకి ఆవల కొత్త నగరాన్ని నిర్మించాలన్న ఆలోచన మొదలైంది. కానీ, పనులు ప్రారంభం కాలేదు. ఇబ్ర హీం ఆదేశాలతోనే మూసీ దాటేందుకు వీలుగా వంతెన నిర్మాణం మొద లైంది. అప్పుడు నగరంలోకి ఓ వ్యక్తి కాలు మోపాడు.

ఆయనే మీర్‌ ముహమ్మద్‌ మొమిన్‌ అస్తరాబాదీ. ఈయన ఇరాన్‌ సఫావిద్‌ రాజ్య రాజధాని ఇస్ఫహాన్‌కు చెందిన ప్రముఖ పండితుడు. అక్కడి అస్తరాబాద్‌లో పుట్టినప్పటికీ, సఫా విద్‌ రాజకుమారుడు హైదర్‌కు ట్యూట ర్‌గా పనిచేసేవాడు. ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, వైద్యం, ఆధ్యాత్మికం... ఇలా పలు అంశాల్లో నైపుణ్యం ఆయన సొంతం. అక్కడి రాజు మృతితో ఆయన హైదరాబాద్‌కు వచ్చాడు. ఇక్కడి కుతుబ్‌షాహీ పాలకులు పర్షియాకు చెందిన వారే కావటంతో అప్పటికే పర్షియాకు చెందిన ఎంతోమంది నిపుణులు హైదరాబాద్‌కు వస్తు ండేవారు. అలా వచ్చిన ఆయన తన నైపుణ్యంతో వెంటనే పాలకులను ఆకట్టుకున్నాడు.

పురానాపూల్‌ ...
సరిగ్గా అది నగర నిర్మాణానికి ఏర్పాట్లు జరు గుతున్న తరుణం. అప్పటికే పురానాపూల్‌ వంతెన సిద్ధమవుతోంది. వెంటనే తన నైపుణ్యాన్ని దానిమీద ప్రయోగించారు. పర్షియన్‌ ఆర్కి టెక్చర్‌ నమూనాను చొప్పించి అప్పటికే ఉన్న డిజైన్‌ను మార్పించారు. ఇరాన్‌లో 13వ శతా బ్దంలో నిర్మించిన వంతెన డిజైన్‌తో దీనికి రూపకల్పన చేశారు. ప్రస్తుతం ఇస్ఫహాన్‌లో పర్యాటక ప్రాంతంగా వెలుగొందుతున్న వంతెనలు (కొన్ని పురాన్‌ పూల్‌ తర్వాత కట్టినవి) అచ్చు పురానాపూల్‌ వంతెనను స్ఫురిస్తాయి.

చార్మినార్‌..
హైదరాబాద్‌ నగర సంతకం చార్మినార్‌ ప్రధాన డిజైన్‌ ఈయనదే. భారీ మినార్‌లతో కట్టడాలుండటం పర్షియన్‌ పద్ధతి. అక్కడి మసీదులకు ఎత్తయిన మినార్లు ఉంటాయి. వాటి మీదకు ఎక్కి ప్రార్థనలకు స్థానికులను గట్టిగా అరిచి పిలిచేవారు. ఇస్ఫహాన్‌లో 1316లో నిర్మించిన మినార్‌ ఏ జొంబన్‌ మసీదు నమూనాతో చార్మినార్‌కు డిజైన్‌ చేశారు. దానిలాగే ఆర్చి, అలాగే మినార్లు (మినార్‌ ఏ జొంబన్‌కు రెండే) డిజైన్‌ చేశారు.

అప్పటికే ఆయన్ను పేష్వా (ప్రధానమంత్రి)గా నియమించారు. 1590లో మొదలైన హైదరాబాద్‌ను మరో ఇస్ఫహాన్‌ తరహాలో రూపొందించాలని నిర్ణయించి మొమిన్‌ తన మార్కు చూపించారు. అలా 40 ఏళ్లపాటు ఆయన పేష్వాగా కొనసాగారు. మళ్లీ ఇస్ఫహాన్‌కు వెళ్లకుండా ఇక్కడే ఉండి చనిపోయారు. ఆయన రూపొందించిన మీర్‌ మొమిన్‌ కా దాయరాలోనే ఆయన్ను ఖననం చేశారు. ఇప్పటికీ ఆయన సమాధి అక్కడ ఉంది. భారత సంప్రదాయాలను ధ్వంసం చేసి పర్షియా పద్ధతులను రుద్దినప్పటికీ, నగర నిర్మాణంలో ఆయన పాత్ర మాత్రం చరిత్రలో నిలిచిపోయింది. చనిపోయే ముందు ఆయన రాసిన పుస్తకంలో హైదరాబాద్‌ను మరో ఇస్ఫహాన్‌గా అభివర్ణించారు. అందుకే హైదరాబాద్‌ చరిత్రలో ఇస్ఫహాన్‌కు అంత ప్రాధాన్యం. యుద్ధంలో ఇస్ఫహాన్‌ దెబ్బతింటే హైదరాబాద్‌ మనసుకు గాయమైంది అందుకే.

Advertisement
 
Advertisement
Advertisement