రుణమాఫీపై సర్కారు కసరత్తు | Sakshi
Sakshi News home page

రుణమాఫీపై సర్కారు కసరత్తు

Published Thu, Mar 28 2024 2:21 AM

Government exercise on loan waiver - Sakshi

గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా ఏర్పాట్లు

బ్యాంకులతో ఇప్పటికే చర్చించిన సీఎం

సాక్షి, హైదరాబాద్‌: రైతు రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే బ్యాంకులతో దీనిపై చర్చించారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల వరకు పంట రుణాల మాఫీకి కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

గతంలో లక్ష రూపాయల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని చెప్పి అధికారం చేపట్టిన బీఆర్‌ఎస్‌ రుణమాఫీ చేసేందుకు రకరకాల కొర్రీలు పెట్టిందని ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పదేపదే ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే.  రాష్ట్రంలో మొత్తం 40.66 లక్షల మంది రైతులకు రూ. 25,916 కోట్లు మాఫీ చేయాల్సి ఉండగా.. కుటుంబ సభ్యుల్లో ఒకరికి మాత్రమే వర్తిస్తుందని కొర్రీ పెట్టి లబ్ధిదారుల సంఖ్యను కుదించిందని ధ్వజమెత్తింది.

మరోవైపు అయిదేళ్ల పాటు వంతుల వారీగా రుణమాఫీ నిధులు విడుదల చేసిన అప్పటి ప్రభుత్వం.. చివరకు కేవలం 23 లక్షల మంది రైతులకే రుణ మాఫీ చేసినట్టుగా అధికారులు లెక్కలు తేల్చినట్టు సమాచారం. దాదాపు 14 లక్షల మంది రైతులకు రుణమాఫీ సొమ్ము ఎగవేసినట్టుగా లెక్కగట్టారు. ఈ నేపథ్యంలో గతంలో జరిగిన తప్పులు జరగకుండా అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేసే ప్రతిపాదనలపై మొదటి వంద రోజుల్లోనే కసరత్తు మొదలు పెట్టినట్లు అధికారులు చెబుతున్నారు.  

Advertisement
Advertisement