
ప్రాణాలు తీసుకున్న తండ్రీకొడుకులు
దుబారా ఖర్చులు చేసి..
మాణిక్భండార్లో ఘటన
కామారెడ్డి: డబ్బులు ఉన్నప్పుడు దుబార ఖర్చులు చేశారు. కాలక్రమేనా.. కనీసం టీ తాగటానికి కూడా డబ్బులు లేక సతమతమయ్యారు. దానికి తోడు కొడుకు సతీశ్కు ఆరు నెలల క్రితం పక్షవాతం రావటంతో సేవలు చేయటానికి కూడా ఎవ్వరు లేకపోవడంతో.. 75 సంవత్సరాల వృద్ధుడైన తండ్రి ఆకుల చిన్న సాయిలు ఓపిక ఉన్నకాడికి సేవలు చేశాడు. చివరికి నీకు సేవలు చేయటం నాతో కావటం లేదు బిడ్డా... ఇక నేను ఏదైన మందు తాగి చచ్చిపోతాను అని తన అభిప్రాయాన్ని ఈ నెల 6 న కొడుకు సతీశ్తో చెప్పాడు.
నీతోపాటు నేను కూడా అదే పని చేస్తా బాపూ అంటూ చెప్పి అదే రోజు విష గుళికలు తెప్పించుకుని నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మాణిక్భండార్ గ్రామంలోని సొంత ఇంట్లోనే ఇద్దరూ కలిసి విషగుళికలు మింగారు. ఇద్దరూ వాంతులు చేసుకోవటంతో గమనించిన సాయిలు పెద్ద కుమారుడు సంతోష్ వెంటనే వారిద్దరిని ఆస్పత్రికి తరలించాడు. చికిత్సపొందుతూ సతీశ్ (32) సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. తండ్రి ఆకుల చిన్న సాయిలు (75) ఆదివారం మృతి చెందాడు. రెండ్రోజుల వ్యవధిలో తండ్రీకొడుకులు మృతి చెందటంతో మాణిక్భండార్ గ్రామంలో విషాదం నెలకొంది.
వ్యవసాయ భూమి అమ్మగా వచ్చిన సుమారు రూ. 90 లక్షలకు పైగా డబ్బులను సతీశ్ దుబారాగా ఖర్చు చేశాడు. తీరా చేతిలో చిల్లి గవ్వకూడా లేకుండాపోయింది. పైగా సతీశ్ మూడు వివాహాలు చేసుకున్నప్పటికీ ఒక్క భార్య కూడా కాపురం చేయలేదు. దీంతో తీవ్రమనస్తాపానికి గురై గత సంవత్సం తల్లి అనారోగ్యంతో మృతి చెందింది. ఆరు నెలల క్రితం సతీశ్కు పక్షవాతం వచ్చి మంచం పట్టాడు. అప్పటి నుంచి తండ్రి సేవలు చేశాడు. డబ్బులు లేక ఆస్పత్రిలో వైద్యం చేయించుకోలేని పరిస్థితి ఏర్పడింది.