పీఏసీ చైర్మన్‌గా ఫిరాయింపు ఎమ్మెల్యే! | Defection MLA as PAC chairman in Telangana Congress | Sakshi
Sakshi News home page

పీఏసీ చైర్మన్‌గా ఫిరాయింపు ఎమ్మెల్యే!

Sep 10 2024 12:57 AM | Updated on Sep 10 2024 12:57 AM

Defection MLA as PAC chairman in Telangana Congress

బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే అరికెపూడి గాం«దీకి పదవి 

ప్రతిపక్ష నేత సూచించిన వారికి పీఏసీ చైర్మన్‌

పదవి ఇచ్చే ఆనవాయితీకి చెల్లుచీటీ! 

అంచనాల కమిటీ చైర్మన్‌గా పద్మావతిరెడ్డి..

ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్‌గా కె.శంకరయ్య 

మూడు అసెంబ్లీ కమిటీలను నియమించిన స్పీకర్‌

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాందీకి కీలకమైన అసెంబ్లీ ‘ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ)’ చైర్మన్‌ పదవి దక్కింది. సాధారణంగా అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సూచించిన ప్రతిపక్ష ఎమ్మెల్యేకే పీఏసీ చైర్మన్‌ పదవిని కట్టబెట్టడం ఆనవాయితీ. దీనికి భిన్నంగా శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌.. సోమవారం పీఏసీ చైర్మన్‌గా అరికెపూడి గాందీని నియమిస్తున్నట్టు ప్రకటించారు. దీనితోపాటు మరో రెండు అసెంబ్లీ కమిటీలకు కూడా చైర్‌పర్సన్లు, సభ్యులను నియమించారు. 

ఫిరాయింపు ఎమ్మెల్యేకు పదవి ఎలా? 
అసెంబ్లీ వ్యవస్థలో పీఏసీ చాలా కీలకం. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి పైసాను కమిటీ క్షుణ్నంగా పరిశీలిస్తుంది. ఆయా అంశాలపై అసెంబ్లీకి నివేదికలు ఇస్తుంది. అలాంటి కీలక పదవిని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేకు కట్టబెట్టడంపై రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. నిజానికి ఈ పదవి కోసం మాజీ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పేరును బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రతిపాదించినట్టు సమాచారం. కానీ బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన (మూడు సార్లు ఎమ్మెల్యే) గాం«దీని పీఏసీ చైర్మన్‌గా నియమించారు. 

మరో రెండు కమిటీలు కూడా.. 
ఇక అంచనాల (ఎస్టిమేట్స్‌) కమిటీ, ప్రభుత్వరంగ సంస్థల (పబ్లిక్‌ అండర్‌ టేకింగ్స్‌) కమిటీలను కూడా స్పీకర్‌ నియమించారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అంచనాల కమిటీ చైర్మన్‌గా కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతిరెడ్డి, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్‌గా కె.శంకరయ్య నియమితులయ్యారు. మూడు కమిటీల్లోనూ పార్టీల వారీగా అసెంబ్లీ, కౌన్సిల్‌ల నుంచి సభ్యులను నియమించారు. 

మూడు కమిటీలు ఇవే.. పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ 
అరికెపూడి గాంధీ (చైర్మన్‌), వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి, రామారావు పవార్, అహ్మద్‌ బిన్‌ అబ్దుల్‌ బలాలా, కూనంనేని సాంబశివరావు (అసెంబ్లీ సభ్యులు).. టి.జీవన్‌రెడ్డి, టి.భానుప్రసాద్‌రావు, ఎల్‌.రమణ, సత్యవతి రాథోడ్‌ (కౌన్సిల్‌ సభ్యులు). 

ఎస్టిమేట్స్‌ కమిటీ 
నలమాద పద్మావతిరెడ్డి (చైర్మన్‌), దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మాగంటి గోపీనాథ్, సీహెచ్‌ విజయరమణారావు, కోరం కనకయ్య, మాలోతు రాందాస్, మామిడాల యశస్విని, పైడి రాకేశ్‌రెడ్డి (అసెంబ్లీ సభ్యులు).. సుంకరి రాజు, టి.రవీందర్‌రావు, వి.యాదవరెడ్డి (కౌన్సిల్‌ సభ్యులు) 

పబ్లిక్‌ అండర్‌ టేకింగ్స్‌ కమిటీ 
కె.శంకరయ్య (చైర్మన్‌), పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి, కేపీ వివేకానంద, వేముల వీరేశం, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, మక్కన్‌సింగ్‌ రాజ్‌ ఠాకూర్, పట్లోళ్ల సంజీవరెడ్డి, తోట లక్ష్మీకాంతరావు, కౌసర్‌ మొహియుద్దీన్‌ (అసెంబ్లీ సభ్యులు).. పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, శేరి సుభాష్‌ రెడ్డి, తాతా మధుసూదన్, మిర్జా రియాజుల్‌ హసన్‌ ఎఫెండీ (కౌన్సిల్‌ సభ్యులు).   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement