కమిషనర్నే ఆకట్టుకున్న సందీప్
కూరగాయల వ్యాపారి వీడియో వైరల్
ఆఫీసుకు రప్పించుకున్న సైబరాబాద్ సీపీ
సెల్ఫోన్ బహూకరించిన డాక్టర్ రమేష్
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ పోలీసు కమిషనర్ డాక్టర్ ఎం.రమేష్... నిత్యం అత్యంత బిజీగా ఉండే అధికారి. ఈ కమిషనరేట్ పరిధిలో ఉన్న, బయటి నుంచి వచ్చే వీఐపీలు, సాధారణ ప్రజలు ఆయన్ను కలవడానికి వేచి ఉంటారు. కొందరు నేరుగా.. మరికొందరు అపాయింట్మెంట్ తీసుకుని.. ఇంకొందరు సిఫార్సులతో వచ్చి కలుస్తుంటారు. అలాంటి సైబరాబాద్ సీపీ... కూరగాయల వ్యాపారి కుమారుడైన సందీప్ను కలవాలని ఆసక్తి చూపారు. తన సిబ్బందిని పురమాయించి మరీ అతడిని తన కార్యాలయానికి పిలిపించుకున్నారు.
దీనికి కారణం సోషల్మీడియాలో వైరల్గా మారిన సందీప్ వీడియో. రాంనగర్ మార్కెట్లో విలక్షణ శైలితో కూరగాయలు విక్రయిస్తున్న సందీప్ వీడియో ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నెటిజనులతో పాటు సైబరాబాద్ సీపీ రమేష్ చూశారు. ఆయనను యువకుడి శైలి ఆకట్టుకోవడంతో.. స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మహేష్ ద్వారా సందీప్ను గురువారం గచి్చ»ౌలిలోని కమిషనరేట్కు రప్పించారు. ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ చేస్తున్న సందీప్.. తల్లి చేసే కూరగాయల వ్యాపారంలో చేదోడువాదోడుగా ఉంటున్నాడు. తన వాక్చాతుర్యంతో మార్కెట్కు వచి్చన వినియోగదారుల్ని ఆకట్టుకుంటున్నాడు.
పోలీసుల కోసం రీల్స్ చేయాలని..
రీల్స్, కంటెంట్ చేయడంపై ఆసక్తి, నైపుణ్యం ఉన్న సందీప్కు వాటిని చిత్రీకరించడానికి సొంతంగా సెల్ఫోన్ లేదు. ఈ విషయం తెలుసుకున్న సీపీ రమేష్... ఓ కొత్త ఫోన్ను అతడికి బహూకరించారు. ఈ ఫోన్తో సైబరాబాద్ పోలీసుల కోసం కొన్ని రీల్స్, కంటెంట్ తయారు చేయాలని సూచించారు. సైబర్ నేరాలు, డ్రగ్స్కు వ్యతిరేకంగా.. రోడ్డు ప్రమాదాలు నిరోధానికి తాము చేసే పోరాటాలకు మద్దతుగా అవి ఉండాలన్నారు. కమిషనర్ రమేష్కు ధన్యవాదాలు తెలిపిన సందీప్.. త్వరలోనే కొన్ని రీల్స్ తయారు చేసుకువస్తానన్నాడు.


