‘శక్తి’యుక్తులపై తలోదారి | Confusion in polytechnic education | Sakshi
Sakshi News home page

‘శక్తి’యుక్తులపై తలోదారి

Aug 21 2026 5:56 AM | Updated on Aug 21 2026 5:56 AM

Confusion in polytechnic education

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిపై గురువారం రాస్తారోకో చేస్తున్న సంజయ్‌గాంధీ మెమోరియల్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థులు

పాలిటెక్నిక్‌ విద్యలో గందరగోళం... ప్రవేశాలు, ఫీజులపై స్కిల్స్‌ వర్సిటీ పట్టు 

ప్రైవేటు పెత్తనంపై విద్యార్థి సంఘాలు, ఉద్యోగుల ఆందోళన

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌ కాలేజీలను శక్తి విభాగం (కార్మిక శాఖ)లోకి తీసుకురావడంతోపాటు ఆయా కాలేజీలను యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీకి అనుసంధానిస్తూ ప్రభుత్వం జీవో నం. 97 జారీ చేయడం గందరగోళానికి దారితీస్తోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని ఓవైపు విద్యార్థి సంఘాలు, సాంకేతిక విద్యామండలి ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే మరోవైపు స్కిల్స్‌ వర్సిటీ పాలక మండలి పాలిటెక్నిక్‌ విద్యపై పట్టు కోసం ప్రయత్నిస్తోంది. విద్యార్థులు, ఉద్యోగుల వ్యతిరేకత తీవ్రతరమైతే దాన్ని దారికి తేవడం కష్టమని నిఘా వర్గాలు హెచ్చరించడంతో ఈ వ్యవహారంపై ప్రభుత్వ ఉన్నతాధికారులు గురువారం సమీక్షించారు. పరిస్థితిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాకే ఈ విషయంలో విధివిధానాలు ఖరారు చేయాలని నిర్ణయించారు. 

అధికారాలు కోరుతున్న స్కిల్స్‌ వర్సిటీ... 
స్కిల్స్‌ యూనివర్సిటీ పాలకవర్గం బహుళజాతి సంస్థల ప్రతినిధుల కనుసన్నల్లో ఉంది. విద్యార్థులకు అవసరమైన నైపుణ్యం అందించే కోర్సులు, సిలబస్‌ రూపకల్పనను ప్రత్యేకంగా రూపొందిస్తోంది. పారిశ్రామిక భాగస్వామ్యంపై దృష్టి పెట్టాలని భావిస్తోంది. ప్రభుత్వం కేవలం మౌలిక వసతులు సమకూరిస్తే నైపుణ్య శిక్షణ స్కిల్స్‌ వర్సిటీ సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకు అవసరమైన నిధులనూ సమకూర్చుకోవాల్సిందే. ఈ తరహా ఆర్థిక పరమైన బాధ్యత ఉంది కాబట్టి అన్ని అధికారాలూ తమకు ఉండాలని పాలక మండలి ప్రభుత్వానికి సూచించింది. తాజాగా పాలిటెక్నిక్‌ కాలేజీల నిర్వహణ, ఫీజులు, సిలబస్, బోధన ప్రణాళిక మొత్తం తమ చేతుల్లో ఉండాలని ప్రతిపాదిస్తోంది. రాష్ట్రంలో 59 ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలతోపాటు 53 ప్రైవేటు పాలిటెక్నిక్‌ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇవ్వడం తమ పరిధిలో ఉండాలని కోరుతోంది. అలాగే పాలిటెక్నిక్‌ విద్యకు అవసరమైన ఫీజుల నిర్ణయం తమకే ఉండాలని, సర్టిఫికెట్లు జారీ చేసే అధికారం కూడా కోరుతోంది. ఉద్యోగులపై పూర్తి అజమాయిషీ ఇవ్వాలంటోంది. ఈ దిశగా విధివిధానాలు ఉంటే తప్ప ముందుకెళ్లలేమని స్పష్టం చేస్తోంది. 

ఫీజుల భారం పడుతుందంటున్న విద్యార్థులు 
పాలిటెక్నిక్‌ విద్యకు ఇటీవల డిమాండ్‌ పెరుగుతోంది. ఈ ఏడాది ఏకంగా 92 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ప్రైవేటు కాలేజీల్లోనూ 58 శాతం సీట్లు నిండాయి. గతేడాది వరకు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో 25 రకాల కోర్సులుండగా.. ఈసారి ప్రభుత్వ కళాశాలల్లో 10 కొత్త కోర్సులను ప్రవేశపెట్టారు. వాటిల్లోనూ సగటున 80 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే స్కిల్స్‌ వర్సిటీ అంతర్జాతీయ సిలబస్‌ను, పారిశ్రామిక భాగస్వామ్యాన్ని ప్రతిపాదిస్తోంది. దీనివల్ల తమపై ఫీజుల భారం పడుతుందని.. కొన్ని సీట్లను యాజమాన్య కోటా తరహాలో పాలక మండలి అమ్ముకునే పరిస్థితి ఉంటుందని విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అదే జరిగితే ప్రస్తుతం రూ. 3 వేలు ఉన్న వార్షిక ఫీజు ఏకంగా రూ. 50 వేలకు పెరిగే ప్రమాదం ఉంటుందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు ఉద్యోగులు కూడా భద్రతపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం విద్యాశాఖ పరిధిలో ఉన్న తామంతా స్వతంత్ర ప్రతిపత్తితో ఉండే స్కిల్స్‌ వర్సిటీ పరిధిలోకి వెళ్తే పదోన్నతులు, ఇంక్రిమెంట్ల గురించి అడిగే అవకాశం ఉండదని భయపడుతున్నారు. అందుకే వారు సైతం ఆందోళన బాట పట్టారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీసుకొనే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement