వికారాబాదు జిల్లా: బస్సు స్టీరింగ్ పట్టి కుటుంబాన్ని నడిపిన డ్రైవర్ దస్తగిరి మృతితో కుటుంబసభ్యులు దిక్కులేని పక్షులయ్యారు. మీర్జాగూడ బస్సు దుర్ఘటనలో దస్తగిరి దుర్మరణం చెందడంతో అతడి ఇద్దరు భార్యలు, పిల్లలు, వద్ధురాలైన తల్లి శోకసంద్రంలో మునిగిపోయారు. మొదటి భార్య రెండున్నరేళ్లుగా పిల్లలతో కలిసి యాలాల మండలం చెన్నారంలో తల్లి ఖాజాబీతో కలిసి ఉంటోంది. దస్తగిరి పెద్ద కొడుకు ఆహ్మద్ హైమద్ జినుగూర్తి మైనార్టీ గురుకులంలో ఆరో తరగతి చదువుతుండగా, చిన్న కొడుకు చెన్నారంలోని ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. దస్తగిరి కొన్నాళ్లుగా రెండో భార్య సాజిదాబేగం, తల్లి షౌకత్బేగంతో కలిగి తాండూరు మాణిక్నగర్లోని ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. అతడి అంత్యక్రియలు సోమవారం రాత్రి పాత తాండూరు నిర్వహించారు.
తల్లిలేని పిల్లలయ్యారు
తాండూరు: బస్సు ప్రయాణం నా భార్యను దూరం చేస్తుందనుకోలేదు. ముగ్గురు చిన్నారులు తల్లిలేని పిల్లలుగా మారారని మృతురాలు తబస్సుమ్ జహాన్ భర్త మహమ్మద్ మాజిద్ కంటతడి పెట్టుకున్నారు. తబస్సుమ్కు బీపీ ఉండటంతో నగరంలోని ఓ డాక్టర్ వద్ద అపాయింట్మెంట్ తీసుకున్నాడు. భార్య, ముగ్గురు పిల్లలు మహమ్మద్ మాజిన్, మెహ్విష్ జహాన్, ఐదేళ్ల కుమారుడు ముక్రమ్తో కలిసి సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ బస్సు ఎక్కాడు. ఆడవారికి కేటాయించిన సీట్లతో భార్య, కొడుకు ముక్రమ్ కూర్చున్నారు. పక్క సీట్లో నేను మరో ఇద్దరు పిల్లలు కూర్చున్నాం. వికారాబాద్ దాటాక ఇద్దరు పిల్లలు నిద్రపోయారు. తల్లి వద్ద కూర్చున్న ముక్రమ్ ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు తన వద్దకు వచ్చి ఒడిలో కూర్చున్నాడు. తర్వాత జరిగిన ప్రమాదంలో తబస్సుమ్ మరణించింది. మేము ప్రాణాలతో బయటపడ్డాం. స్థానికులు రక్షించారు. డాక్టర్ అపాయింట్మెంట్ 9 గంటలకు ఉండటంతో ఫస్ట్ బస్సులో బయలుదేరాం.


