సోషల్ మీడియాను బాగా వాడుకోవాలి
బీజేపీ జాతీయ మహిళా మోర్చా తీర్మానం
సాక్షి, హైదరాబాద్: బీజేపీ కార్యక్రమాలు, మోదీ ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, మంచి పనుల ప్రచారానికి సోషల్ మీడియాను విరివిగా ఉపయోగించుకోవాలని బీజేపీ జాతీయ మహిళా మోర్చా తీర్మానించింది. శనివారం హైదరాబాద్లో జాతీయ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మీడియా, సోషల్ మీడియా వర్క్షాప్ జరిగింది. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాలను ఎలా ఉపయోగించుకోవాలన్న దానిపై జాతీయ పార్టీ బాధ్యులు సందీప్ పాత్రా, దుష్యంత్కుమార్ గౌతమ్, మహిళా మోర్చా మీడియా, సోషల్ మీడియా బాధ్యులకు శిక్షణనిచ్చారు.
సామాజిక మాధ్యమాలను మెరుగైన విధంగా ఉపయోగించుకోవాలని, పార్టీ సంస్థాగతంగా బలోపేతమయ్యే దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్, ప్రధాన కార్యదర్శి సుఖ్ప్రీత్కౌర్, రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి తదితరులు పాల్గొన్నారు. కాగా, 2019 లోక్సభ ఎన్నికల్లో తాను సోషల్ మీడియాను సరిగా ఉపయోగించుకోకపోవడం వల్లే ఓటమి పాలైనట్లు డీకే అరుణ తెలిపారు.