సాక్షి, చైన్నె: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు రూ.1,302 కోట్లు ఖర్చు అవుతున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్ మంగళవారం ప్రకటించారు. అలాగే, తుది ఓటర్ల జాబితాను ప్రకటించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ ముగించి ఇప్పటికే ఓటర్ల జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో 5.67 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్టు తెలిపారు. అయితే నామినేషన్ దాఖలు వరకు కొత్త ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని ప్రకటించారు. దీంతో కొత్తగా వచ్చిన ఓటర్ల దరఖాస్తులను పరిశీలించి తుది జాబితాను మంగళవారం అర్చనా పట్నాయక్ ప్రకటించారు. ఇందులో మొత్తం ఓటర్లు: 5,73,43,291గా ప్రకటించారు. ఇందులో పురుషులు–2,80,30,658, మహిళలు– 2,93,04,905, ఇతరులు– 7,728 మంది ఉన్నట్టు వివరించారు. రాష్ట్రంలో పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండడం గమనార్హం. కాగా, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి నిఘా బృందాలు నిర్వహించిన తనిఖీల్లో మొత్తం రూ.462.74 కోట్ల విలువైన నగదు, వస్తువులు పట్టుబడ్డట్టు వివరించారు. గత ఎన్నికల కంటే ఈ సారి రూ. 507 కోట్లు ఖర్చు అధికంగా ఉండడం గమనార్హం.


