
క్లుప్తంగా
మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
సాక్షి, చైన్నె : పెరంబూరు పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. విల్లుపురం జిల్లా ఉలందూరు పేటకు చెందిన అళగేషన్ కుమార్తె సుమతి(30) 2017సంవత్సరంలో తమిళనాడు పోలీసు శాఖలో చేరారు. తొలుత పులియాంతోపు ట్రాఫిక్ విభాగంలో పనిచేయగా 2023లో పెరంబూరు స్టేషన్కు బదిలీ అయ్యారు. సెంబియం పోలీసు క్వార్టర్స్లో ఉన్న సుమతిని తరచూ సహచర కానిస్టేబుల్ జయలక్ష్మి కలుస్తుండేవారు. శుక్రవారం రాత్రి విధులు ముగించుకుని వచ్చిన ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు. అనంతరం జయలక్ష్మి దుస్తులు ఆర వేయడానికి డాబా పైకి వెళ్లింది. పది గంటల సమయంలో డాబా మీదకు వెళ్లిన ఆమె తిరిగి గదిలోకి వచ్చి చూడగా సుమతి ప్యాన్కు ఉరి వేసుకుని వేలాడుతుండటాన్ని చూసి, ఆమెను రక్షించే ప్రయత్నం చేసింది. క్వార్టర్స్లో ఉన్న వాళ్లు ఆమె అరుపులకు పరుగులు తీశారు. సుమతిని రక్షించే ప్రయత్నం చేశారు. రెట్టేరిలోని ఓప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమ్తితం కీల్పాకం ఆస్పత్రికి తరలించారు. సెంబియం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మరణానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.
మోసం కేసులో
ముగ్గురి అరెస్టు
తిరువళ్లూరు: స్వచ్ఛంద సంస్థ పేరుతో రూ.1.25 కోట్లు మోసం చేసి, నాలుగేళ్లుగా పరారీలో ఉన్న మహిళతోసహా ముగ్గురిని పోలీసులు ఊటీలో అరెస్టు చేశారు. తిరువళ్లూరు జిల్లా ఊత్తుకోట తాలుకా దిమ్మబూపాలపురం గ్రామంలో గీత(57) నివాసమున్నారు. అదే ప్రాంతానికి చెందిన రవిచంద్రన్(45), తేన్మెళి(37), తేన్మెళి భర్త సురేష్(48) ముగ్గురు కలసి గీత వద్దకు వెళ్లి తాము స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి, పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు నమ్మించారు. అనంతరం గత 2021వ సంవత్సరంలో రూ.3.50 లక్షలు అప్పుగా తీసుకున్న తేన్మెళి తరచూ గీత వద్దకు వెళ్లి అప్పుగా భారీ మొత్తాన్ని తీసుకున్నారు. తరువాత తమకు పెద్ద ప్రాజెక్టు వచ్చిందని, పనులు చేస్తే భారీగా లాభం వస్తుందని వచ్చే లాభంలో వాటా ఇస్తామని నమ్మించి ముగ్గురు కలిసి గీత వద్ద రూ.1.25 కోట్లు నగదు, బంగారు నగలను తీసుకుని ఉడాయించారు. తన వద్ద తీసుకున్న నగదు, బంగారు నగలను తిరిగి చెల్లించాలని పలు సార్లు కోరినా ఫలితం లేకపోవడంతో నాలుగేళ్ల కిందట బాధితురాలు గీత తాను మోసపోయానని భావించి, ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలించగా వారు పరారయ్యారు. ఈ క్రమంలో నాలుగేళ్లుగా పరారీలో ఉన్న నిందితులను పట్టుకోవాలని ఎస్పీ ఆదేశించిన క్రమంలో ప్రత్యేక టీమ్ నిందితులు ఊటీలో ఉన్నట్టు గుర్తించి, వారిని అరెస్టు చేశారు.
భార్యపై కిరోసిన్ పోసి నిప్పటించాడు!
అన్నానగర్: ఓ వృద్ధుడు తన భార్యపై కిరోసిన్ పోసి, నిప్పంటించి, సజీవ దహనం చేశాడు. విరుదునగర్ జిల్లా కరియాపట్టిలోని చెట్టియార్ వీధి నివాసి నాగేంద్రన్ (60), కస్తూరి(52) దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. పిల్లద్దరూ వివాహితులు కావడంతో విదేశాల్లో నివసిస్తున్నారు. నాగేంద్రన్, అతని భార్య అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. దంపతుల మధ్య తరచుగా గొడవలు జరిగేవి. శనివారం తెల్లవారుజామున ఎప్పటిలాగే ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. దీంతో ఆగ్రహించిన నాగేంద్రన్, కస్తూరిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. దీంతో ఆమె పరుగున వెళ్లి నాగేంద్రన్ను పట్టుకుంది. దీంతో నొప్పి భరించలేక పైనుంచి దూకాడు. ఈ ఘటనలో కస్తూరి అక్కడికక్కడే మరణించింది. గాయపడిన నాగేంద్రన్ను పోలీసులు విరుదునగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గోసంరక్షణ ట్రస్టుకు విరాళం
కాణిపాకం: చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన గోసంరక్షణ ట్రస్టుకు శనివారం హైదరాబాద్కు చెందిన ప్రవీణ్ 2,300 డాలర్లు విరాళంగా అందజేశారు. ఈ మేరకు ఈవో పెంచలకిషోర్కు ఆ నగదును అందజేయగా.. ఆయన దాత కుంటుంబానికి ప్రత్యేక దర్శనభాగ్యం కల్పించారు.

క్లుప్తంగా

క్లుప్తంగా