
అడుగంటిన స్వర్ణముఖి బ్యారేజ్
వాకాడు : స్వర్ణముఖి బ్యారేజ్లో నీరు అడుగంటింది. సాధారణంగా ప్రభుత్వం ఏటా ఏప్రిల్, మే నెలల్లో 200 క్యూసెక్కుల తెలుగుగంగ నీటిని విడుదల చేసేది. తద్వారా రైతులు పొలం పనులు ప్రారంభించేవారు. ఈ ఏడాది ఆ ఊసే లేకపోవడంతో ఏమి చేయాలో అర్థంకాక రైతులు ఆందోళన చెందుతున్నారు.వాకాడు స్వర్ణముఖి బ్యారేజ్ నీటి ఆధారంగా 11 చెరువులు ఉన్నాయి. అలాగే పులి కాలువ, రొయ్యల కాలువ, చల్లాకాలువ, వాగులు, వంకలు, పిల్ల కాలువలు కలిపి 16 వరకు ఉన్నాయి. వీటి ఆధారంగా కోట, వాకాడు, చిట్టమూరు మండలాలకు చెందిన 2,600 మంది రైతులు దాదాపు 20 వేల ఎకరాల్లో పంటలు సాగుచేసుకుంటున్నారు. ప్రతి ఏడాది లాగానే ఈ సారి బ్యారేజ్కి గంగ నీటిని విడుదల చేస్తారన్న నమ్మకంతో రైతులు చెరువులు, బోర్ల ద్వారా వచ్చే అరకొర నీటి ఆధారంగా పూర్తి స్థాయి విస్తీర్ణంలో పంటలు సాగు చేశారు. ప్రస్తుతం బ్యారేజ్తోపాటు దాని ఆధారిత జలాశయాలు ఎండిపోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు.
అడుగంటిన భూగర్భ జలాలు
బ్యారేజ్ ఆధారంగా 1,850 తాగునీటి బోర్లు వున్నాయి. వాటి ద్వారా ప్రజలకు వేసవిలోనూ నీరు సమృద్ధిగా సరఫరా చేసేవారు. ప్రస్తుతం బ్యారేజ్లో నీరు అడుగంటింది. ఎడారుని తలపిస్తోంది. ఎడగారు రైతులకు ఎండమావిని మిగిల్చింది. బోర్లలోనూ నీరు తక్కువగా వస్తుండడంతో ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. కొందరు రైతులు బోర్ల ఆధారంగా పంటలు పెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ భూ గర్భ జలాలు అడుగంటిపోయి బోర్లు పనిచేయడం లేదు. పస్తుతం మూడు మండలాల్లో మూడు పంటలు కాదు కదా.. ఒక్క పంట కూడా పండించలేని పరిస్థితి దాపురించింది. పాలకులు స్పందించి తెలుగు గంగ జలాలను విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.