
‘మాయాకూత్తు’ ఫస్ట్లుక్ పోస్టర్ విడుదల
తమిళసినిమా: రాహుల్ మూవీ మేకర్స్ రాహుల్ దేవా, అభినయ క్రియేషనన్స్ ప్రసాద్ రామచంద్రన్ కలిసి భారీ బడ్జెట్లో నిర్మించిన చిత్రం మాయాకూత్తు. ఈ చిత్రం ద్వారా ఏఆర్.రాఘవేంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన దర్శకుడు బ్రహ్మ శిష్యుడు అన్నది గమనార్హం. అలాగే గత పదేళ్లుగా పలు షార్ట్ ఫిలిమ్స్ రూపొందించడంతోపాటు ఉడన్పాల్ చిత్రానికి కథా రచయిత ఈయనే అన్నది గమనార్హం. కాగా ఆ అనుభవంతో ఆయన ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో నటుడు ఢిల్లీగణేష్, ఎం.రామస్వామి, సాయి దీనా, నాగరాజన్ ప్రధాన పాత్రలు పోషించిన ఇందులో ప్రగదీశ్వరన్, మురుగన్, ఐశ్వర్య, గాయత్రి, రేఖ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. సుందర్ రామకృష్ణన్ చాయాగ్రహణం, అంజనా రాజగోపాలన్ సంగీతం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్రం ఫస్ట్లుక్ పోస్టర్ ను శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో చిత్ర దర్శకుడు పేర్కొంటూ ఇది వైవిధ్య భరితమైన సోషియో ఫాంటసీ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. ఇది కచ్చితంగా ప్రేక్షకులకు మంచి థియేటర్ ఎక్స్ పీరియనన్స్ ఇస్తుందన్న నమ్మకాన్ని దర్శకుడు వ్యక్తం చేశారు. చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.