
పట్టాలు మంజూరు చేయాలని వినతి
తిరువళ్లూరు: ఏళ్ల తరబడి నివాసం వుంటున్న తమకు ఇంటి పట్టాలను మంజూరు చేయాలని పలు మార్లు కలెక్టర్ సహా అధికారులకు వినతి పత్రం అందజేసినా ఫలితం లేదని ఆరోపిస్తూ కుత్తంబాక్కం గ్రామస్తులు శుక్రవారం ఉదయం కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. తిరువళ్లూరు జిల్లా కుత్తంబాక్కం గ్రామంలో 1,500 మంది నివాసం వుంటున్నారు. 50 సంవత్సరాలుగా నివాసం వుంటున్న వీరికి ప్రభుత్వం ఆధార్, ఓటరు గుర్తింపు కార్డులను సైతం అందజేసింది. అయితే ఇంత వరకు ఇంటి పట్టాలు మాత్రం మంజూరు చేయలేదు. పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ ఇప్పటికే పలుమార్లు కలెక్టర్ సహా ఉన్నతాధికారులకు వినతి చేసుకున్నా ఫలితం లేకపోవడంతో కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. సమాచారం అందుకుని సంఘటన స్థలానికి వెళ్లిన అధికారులు వారిలో చర్చలు జరిపారు. త్వరలోనే అధికారులు గ్రామాన్ని పరిశీలించి అర్హులను గుర్తించి పట్టాలను అందజేస్తామన్న హామీతో వారు ఆందోలన విరమించారు.