హుజూర్నగర్ : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్కుమార్ అన్నారు. బుధవారం హుజూర్నగర్లో ఆ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో అన్ని శాఖల్లో అవినీతి పేరుకుపోయిందని, మంత్రులు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారని, రేవంత్ సర్కార్ అసమర్థ సర్కార్లాగా మారిందని ఆరోపించారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ప్రజాసేవ చేయడానికి యువతను స్వచ్ఛమైన రాజకీయాల్లోకి ఆహ్వానిస్తున్నామన్నారు. రాబోయే స్థానిక సంస్థలు, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎల్డీ పోటీ చేస్తుందని తెలిపారు. ఈనెల 27న వరంగల్లో పార్టీ జాతీయ అక్ష్యక్షుడు, కేంద్ర మంత్రి జయంత్సింగ్ చౌదరి మార్గదర్శకత్వంలో భారీ ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. టీఆర్ఎల్డీ అధికార ప్రతినిధి గౌర బీరప్ప మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మోసం చేశాయన్నారు. జిల్లా అధ్యక్షుడు నరేందర్గౌడ్ మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేరలేదని విమర్శించారు. తొలుత పార్టీ కార్యాలయం వద్ద దిలీప్కుమార్కు జిల్లా అధ్యక్షుడు నరేందర్గౌడ్ స్వాగతం పలికి సత్కరించారు. కార్యక్రమంలో టీఆర్ఎల్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నరసింహారావు, విశాల్ పంజరి, రిషబ్ జైష్, కోశాధికారి గిరి కుండే పాల్గొన్నారు.
ఫ టీఆర్ఎల్డీ రాష్ట్ర అధ్యక్షుడు
కపిలవాయి దిలీప్కుమార్


