తల్లిదండ్రులు టీకాలు వేయించాలి
తిరుమలగిరి(తుంగతుర్తి) : మహిళలు క్యాన్సర్ బారిన పడకుండా రక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సిన్ను అందుబాటులోకి తెచ్చాయి. ఈ టీకాతో మహిళల్లో రొమ్ము, గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్లను అరికట్టవచ్చు. 14 నుంచి 15 ఏళ్ల మధ్య ఉన్న కిషోర బాలికలకు టీకాలు వేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా హైస్కూళ్లు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లో 11 వేల మంది కిషోర బాలికలు నమోదై ఉన్నారు. వారికి హెచ్పీవీ వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని మార్చిలోనే ప్రారంభించినా.. అవసరమైన వ్యాక్సిన్లు అందక పోవడం, పదో తరగతి పరీక్షలు జరుగుతున్నందున కిషోర బాలికలు టీకాలకు ముందుకు రాకపోవడంతో కొద్ది రోజులు విరామం ఇచ్చారు. మళ్లీ మంగళవారం నుంచి టీకాలు ఇవ్వనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
జిల్లా వ్యాప్తంగా వ్యాక్సినేషన్
జిల్లాకు ఇటీవల 2500 హెచ్పీవీ వ్యాక్సిన్ డోసులను ప్రభుత్వం సరఫరా చేసింది. వీటిని జిల్లాలోని 23 పీహెచ్సీలు, నాలుగు అర్బన్హెల్త్ సెంటర్లు, ఒక సీహెచ్సీ, మూడు ఏరియా ఆస్పత్రులు, ఒక ప్రభుత్వ వైద్యశాలలో ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 500మంది కిషోర బాలికలకు టీకాలు వేశారు. మిగిలిన వారికి టీకాలు వేయడానికి వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది.
సిబ్బందికి అవగాహన..
జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్లకు, సూపర్ వైజర్లకు, ఏజెంట్లకు హెచ్పీవీ టీకాల కార్యక్రమంపై వైద్య ఆరోగ్యశాఖ అవగాహన కల్పించింది. వాస్తవానికి జనవరి మొదటి వారంలోనే హెచ్పీవీ టీకాలను వేయాలని నిర్ణయించినప్పటికీ కేంద్రం నుంచి టీకాలు సరఫరా కావడంతో జాప్యం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం పూర్తిస్థాయిలో టీకాలను సరఫరా చేయడంతో బాలికలకు వ్యాక్సిన్ వేయడానికి అధికారులు సిద్ధమయ్యారు.
కిశోర బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్
జిల్లాకు చేరిన 2500 యూనిట్లు
నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా టీకాలు
కిషోర బాలికల తల్లిదండ్రులు విధిగా తమ పిల్లలకు హెచ్పీవీ టీకాలు వేయించాలి. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా టీకాలను అందుబాటులో ఉంచాం.
– వెంకటరమణ, డీఎంహెచ్ఓ, సూర్యాపేట


