● పారిశ్రామిక వేత్తలు సద్వినియోగం చేసుకోవాలి
● కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్
భానుపురి (సూర్యాపేట) : తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఈ నెల 11న నల్లగొండ ఐటీ టవర్లో నిర్వహించనున్న ఇన్నోవేషన్ పంచాయతీ కార్యక్రమాన్ని పారిశ్రామికవేత్తలు సద్విని యోగం చేసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ కోరారు. సోమవారం కలెక్టరేట్లో ఇన్నోవేషన్ పంచాయతీ కార్యక్రమ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలకు చెందిన ఆవిష్కర్తలను, పరిశ్రమల వ్యవస్థాపకులను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. పరిశ్రమల ఏర్పాటుపై ఉన్న సందేహాలకు నిపుణులు సలహాలు అందిస్తారని చెప్పారు. రాష్ట్ర రాజధాని వెలుపల ఉన్న ఆవిష్కర్తలకు ఉన్న వనరులు తెలియజేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొనే వారు నిపుణులతో చర్చించి, వ్యాపార సవాళ్లను పరిష్కరించుకోవచ్చన్నారు. జిల్లాకు చెందిన ఔత్సాహిక పరిశ్రమల వ్యవస్థాపకులు పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, జిల్లా పరిషత్ సీఈఓ శిరీష, రెవెన్యూ డివిజన్ అధికారి వేణు మాధవరావు, సీపీఓ కిషన్, డీఎఫ్ఓ సతీష్, స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఇన్చార్జి ప్రణయ్, అధికారులు పాల్గొన్నారు.
ప్రజల ఫిర్యాదులను పరిష్కరించాలి
భానుపురి (సూర్యాపేట) : ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను అధికారులు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల వద్ద నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, జడ్పీ సీఈఓ శిరీష, ఆర్డీఓ వేణు మాధవరావు, అధికారులు పాల్గొన్నారు.


