సూర్యాపేటటౌన్ : ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి చట్ట పరమైన పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఎస్పీ నరసింహ అన్నారు. పోలీసు గ్రీవెన్స్లో భాగంగా సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సమస్యలపై త్వరితగతిన చర్యలు తీసుకొని బాధితులకు భరోసా కల్పించాలన్నారు. ప్రజలు నిర్భయంగా పోలీస్ సేవలు వినియోగించుకోవాలని సూచించారు. శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలకు మరింత చేరువ కావడమే పోలీస్శాఖ ప్రధాన లక్ష్యమన్నారు.
లక్ష్మీనరసింహుడికి
విశేష పూజలు
మఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం స్వామి, అమ్మవార్లకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేకాలు, నిత్యహోమం చేపట్టారు. అనంతరం అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ నిర్వహించారు. అనంతరం విష్వక్సేన ఆరాధన, పుణ్యహవచనం, రక్షాబంధనం, మధుఫర్కపూజ, మాంగల్య ధారణ, తలంబ్రాలతో నిత్య కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం క్షేత్రంలోని శివాలయంలో పార్వతీరామలింగేశ్వర స్వామికి ఏకాదశ రుద్రాభిషేకం చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ బి.జ్యోతి, అర్చకులు భక్తులు పాల్గొన్నారు.
ఆహార భద్రతపై ప్రత్యేక దృష్టి
సూర్యాపేటటౌన్ : ఆహార భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ పెండెం వెంకటరమణ అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా వైద్యారోగ్యశాఖ, ఆరోగ్య భద్రతా విభాగం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఆహార భద్రతా ర్యాలీని ఆయన ప్రారంభించి మాట్లాడారు. సురక్షితమైన, పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం వల్ల అనేక వ్యాధులను నివారించవచ్చన్నారు. కలుషిత ఆహారం వల్ల ఫుడ్ పాయిజనింగ్, డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందన్నారు. వేసవిలో ఆహారం త్వరగా పాడవుతుందని, ప్రజలు మరిన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ నరసింహారావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ జి.చంద్రశేఖర్, వైద్యారోగ్యశాఖ సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.


