● ఆరేళ్లుగా సేవలు అందిస్తున్న
‘స్విమ్మింగ్ షేక్ సుభాన్’
● నాగావళి తీరంలో ప్రత్యేక సేవలు
శ్రీకాకుళం కల్చరల్: శ్రీకాకుళం నగర పరిసరాల్లో నాగావళి నది తీరంలో జరిగిన వినాయక నిమజ్జన కార్యక్రమం మొదటి రోజు అత్యంత ప్రశాంతంగా ముగిసింది. కొంత ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నాగావళి నది ఒడ్డున నది ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పటికీ, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, నీటి ప్రమాదాలు జరగకుండా భక్తులు సురక్షితంగా నిమజ్జనాలు పూర్తి చేసుకున్నారు. జిల్లాకు చెందిన నేషనల్ లైఫ్ సేవింగ్ మెడలిస్ట్, ఎకై ్సజ్ కానిస్టేబుల్ షేక్ సుభాన్ (స్విమ్మింగ్ సుభాన్) స్పాట్లో ఉండి ప్రత్యేక రక్షణ విధులు నిర్వర్తించారు. ఘాట్ వద్దకు వచ్చిన చిన్న పిల్లలను సైతం దగ్గరుండి అత్యంత సురక్షితంగా నిమజ్జనం చేయించారు. ఒకప్పుడు ఏటా మరణాలు సంభవించే ఈ ప్రమాదకర ఘాట్ వద్ద, గత ఆరేళ్లుగా చిన్న ప్రమాదానికి కూడా తావు లేకుండా ‘జీరో క్యాజువాలిటీ’ రికార్డును సుభాన్ కాపాడుకుంటూ రావడంపై భక్తుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్లాస్టిక్ కవర్ల సేకరణ
ఈ ఎకై ్సజ్ కానిస్టేబుల్ విధుల్లో ఉంటూనే అద్భుతమైన పర్యావరణ స్పృహను చాటారు. నిమజ్జనానికి వచ్చిన భక్తులు విసిరేసిన ప్లాస్టిక్ కవర్లు, వ్యర్థాలు నాగావళి నదిలో కలవకుండా ప్రతి ఒక్క కవరును తానే స్వయంగా ఏరి ఒడ్డున వేశారు. ప్లాస్టిక్ వల్ల నదీ జలాలు ఎలా కలుషితమవుతాయో భక్తులకు వివరిస్తూ ఆయన చేసిన ఈ నిస్వార్థ సేవ అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది. ఆంధ్రప్రదేశ్ లైఫ్ సేవింగ్ సొసైటీ ప్రతినిధి సీహెచ్ వెంకటేష్తో పాటుగా సెక్రెటరీ దట్టి ప్రకాష్ ట్రెజరర్ బాలాజీ, వైస్ ప్రెసిడెంట్ నౌపాడు రాజారావు, జిల్లాకు చెందిన సీనియర్ క్రీడాకారులు అభినందించారు.
నదిలో నిమజ్జనం చేయిస్తున్న సుభాన్


