వజ్రపుకొత్తూరు:
ఎప్పుడో తోడును కోల్పోయిన ఆ తల్లికి కొడుకు మాత్రమే ఆధారం.. కొడు కు సంపాదనే బతుకు బండిని నడిపిస్తోంది. ఒకే ఒక్క ప్రమాదం ఆ అమ్మను అనాథను చేసింది. ఒక రోజు కిందటే ఇంటికి వచ్చిన మరో యువకుడి భవిష్యత్ను అంధకారంలోకి నెట్టేసి ఆ కుటుంబానికి శోకం మిగిల్చింది. ఉత్సవాలు చూద్దామని ఉత్సాహంగా వెళ్లిన ఆ ఇద్దరు యువకులు శవాలై ఇంటికి చేరారు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు..
వజ్రపుకొత్తూరు మండలం ఉద్దానం గోపీ నాథపురానికి చెందిన కర్ని తులసీరావు (కోదండరావు) (27), కొండవూరు పంచాయతీ గర్తంవానిపేటకు చెందిన గర్తం మణికంఠ(24) ఆదివారం రాత్రి మండలంలోని సైనూరులో జరుగుతున్న చింతలపోలమ్మ తల్లి ఉత్సవాలు చూద్దామని వెళ్లారు. రాత్రి అక్కడ వినోద కార్యక్రమం జరగడంతో అది తిలకించి తిరిగి వస్తుండగా.. ఉద్దానం రామకృష్ణాపురం రహదారిలో పాతటెక్కలి వద్ద స్కూటీతో విద్యుత్ స్తంభాన్ని ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. ఆదివారం రాత్రి సుమారు 12 నుంచి 2.30 గంటల సమ యంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ముళ్లపొదల్లో పడి ఉన్న యువకుల మృతదేహాలను సో మవారం తెల్లవారు జామున గుర్తించిన స్థానికులు వజ్రపుకొత్తూరు పోలీసులకు సమాచారం అందించారు.
కుటుంబాల్లో కన్నీరు..
కోదండరావు తండ్రి మోహనరావు చాలా ఏళ్ల కిందట మృతి చెందగా తల్లి రాజేశ్వరి ఉన్నారు. ఉపాధి కోసం విదేశాలకు వలస వెళ్లే కోదండరావు మృతితో ఆ తల్లి గుండెలవిసేలా రోదించారు. మణికంఠ ఒక రోజు కిందటే నెల్లూరు నుంచి వచ్చాడు. అతడికి తల్లిదండ్రులు గంగాధర్, నీలవేణిలతో పాటు ఓ తమ్ముడు ఉన్నారు.
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన బైక్
ఇద్దరు యువకుల దుర్మరణం
చింతలపోలమ్మ ఉత్సవాలకు వెళ్లి వస్తుండగా ఘటన


