మహిళలకు ఆసరాగా లైంగిక వేధింపుల
నివారణ కమిటీలు
లైంగిక వేధింపులకు గురైనా,
పని చేసే చోట భద్రత కరువైనా తక్షణ భరోసా
ధైర్యంగా ఫిర్యాదు చేయాలంటున్న కమిటీ సభ్యులు
శ్రీకాకుళం క్రైమ్ : కొన్నాళ్ల క్రితం జిల్లా డీఎంహెచ్వో కార్యాలయంలో ఓ హెల్త్ అసిస్టెంట్ ఓ వివాహిత వద్ద రూ.4.50 లక్షలు తీసుకుని ఫేక్ ఆర్డర్ కాపీ ఇచ్చి ఉద్యోగమని నమ్మించాడు. అక్కడే ఓ జూనియర్ అసిస్టెంట్గా పనిచేసే మహిళ వద్ద రోజూ ఫేక్ అటెండెన్సు రిజిస్టర్లో సంతకాలు పెట్టించి కొన్నాళ్లు జీతం ఇచ్చి ఆపై జాబిచ్చానన్న నెపంతో సదరు మహిళను శారీరకంగా లోబర్చుకున్నాడు. ఉద్యోగానికి సంబంధించి విధులు లేకుండా ఇలా చేస్తుండటంతో అనుమానమొచ్చిన బాధితురాలు డీఎంహెచ్వోను కలిశాక అసలు విషయం బయటపడింది.. అతనిచ్చింది జాబ్కాదని.. ఆ నెపంతో తనను మోసం చేశాడని తెలుసుకుని నిర్ఘాంతపోయింది. ఇదే పరిస్థితి అనేక చోట్ల ఉంది. దాదాపు అనేక ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థల్లో మహిళలు, విద్యార్థినులు నిత్యం ఇలాంటి లైంగిక వేధింపుల సమస్యలు ఎదుర్కొంటున్నా బయటకు చెప్పుకోలేక.. ఫిర్యాదు చేసినా న్యాయం జరుగుతుందో లేదోనని, అనవసరంగా పరువు పోతుందేమోనని భయపడుతున్నారు. ఇంటి నుంచి కాలు బయటపెట్టింది మొదలు ఆకతాయిల నుంచి టార్చర్ మొదలు. మరి మహిళల భద్రతకు చట్టం ఎలా నిలుస్తుదన్నది ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఆవవ్యకత ఎంతైనా ఉంది..
చట్టం కిందకు వచ్చేవివే..
లైంగిక వ్యాఖ్యలు, అసభ్య దూషణ, అసభ్య చూపులు, అవసరం ఉన్నా లేకున్నా అనుమతి లేకుుండా తాకరాదు. ఫోన్లో ఎస్ఎంఎస్, వాట్సాప్, ఈ–మెయిల్, ఫేస్బుక్, ఇన్స్ర్ట్రాగామ్లో అసభ్య, అభ్యంతరకర సందేశాలు పంపరాదు. ఉద్యోగం, పదోన్నతి కల్పన ఆసర చేసుకుని లైంగిక అనుకూలతలుగా మార్చుకోవడం వేధింపుల చట్టం కిందే వస్తాయి.
కమిటీలూ ఉంటాయి..
ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలు, కర్మాగారాలు, పాఠశాలలు, కళాశాలలు, షాపింగ్మాల్స్, దుకాణాలు, ఇతరత్రా రంగాల్లో 10 మంది కంటే ఎక్కువ మంది పనిచేస్తే అక్కడ అంతర్గత కమిటీలు ఏర్పాటు చేయాలి. కమిటీలో చైర్పర్సన్గా సీనియర్ మహిళా అధికారి, ఇద్దరు సభ్యులు, సామాజిక కార్యకర్త ఉంటారు. పనిచేసే చోట లైంగిక వేధింపులకు గురైతే విచారణ చేపట్టడం, ఆరోపణ నిర్ధారణ అయితే చర్యలు సూచించడం, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ఈ కమిటీల విధులు.
న్యాయం జరుగుతుందిలా..!
బాధితురాలు ఘటన జరిగిన మూడు నెలల్లోపు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. లైంగిక వేధింపుల నివారణ హెల్ప్లైన్ నెంబర్ 181కు కాల్ చేసి వివరాలు తెలియజేయవచ్చు. ఫిర్యాదు అందుకున్న 90 రోజుల్లో కమిటీ విచారణ పూర్తి చేసి నివేదికను ఉన్నతాధికారికి అందిస్తుంది. నేరం నిర్ధారణ అయ్యిందంటే నేరస్థితిని బట్టి హెచ్చరించడం, సస్పెన్షన్, తొలగింపు వంటివి చేస్తారు. ఉద్యోగోన్నతి, శాలరీ నిలుపుదల చేసి బాధితురాలికి నష్టపరిహారం అందిస్తారు..


