ఇచ్ఛాపురం: పట్టణంలో ఎల్సీ గేట్ వద్ద పట్టణ పోలీసులు మంగళవారం 30 కిలోల గంజాయి పట్టుకున్నారు. ఎల్సీగేట్ సమీపంలో ఇద్దరు వ్యక్తులు ఒక లగేజి బ్యాగ్, రెండు సూట్కేసులతో రైల్వేస్టేషన్ వైపు వెళ్తుండగా అనుమానం వచ్చి వారిని తనిఖీ చేయగా.. 30.210 కిలోల గంజాయి దొరికింది. వీరిని మహారాష్ట్ర, ముంబై, అంధేరిలో నివాసముంటున్న విశాల్ య శ్వంత్ కాంబ్లె, అర్పిత వర్మ అలియాస్ జరా ఫాతిమాగా గుర్తించారు. గంజాయి వ్యాపారం చేసే మహ్మద్ షరీఫ్ వద్ద పనికి చేరిన వీరు ఒడిశా నుంచి గంజాయి తరలించడానికి బరంపురం వచ్చారు. అక్కడ గంజాయిని సప్లయ్ చేసే రోషన్ అలియాస్ సల్మాన్మజి అనే వ్యక్తికి ఫోన్ చేశారు. ఎల్సీ గేటు వద్ద గంజాయి తీసుకున్నారు. అనంతరం రైల్వేస్టేషన్కు వస్తుండగా అక్కడ పోలీసులకు చిక్కారు. వీరి వద్ద ఉన్న గంజాయి, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఇచ్ఛాపురం రూరల్: విద్యా సంవత్సరం ప్రారంభించినా బడులకు బియ్యం సరఫరా చేయలేదంటూ మంగళవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘మిథ్యాహ్న భోజనమేనా..?’ కథనానికి అధికారులు స్పందించారు. సివిల్ సప్లయ్ గోదాం ఎంఎల్ఎస్ పాయింట్ డిప్యూటీ తహసీల్దార్ కిశోర్ మంగళవారం హుటాహుటిన ఇచ్ఛాపురం మండలం, మున్సిపాలిటీ, కవిటి మండలాల్లోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు మధ్యాహ్న భోజనం బియ్యం సరఫరా చేశారు. దీంతో ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
డీఎంహెచ్ఓ కార్యాలయ ఏఓపై బదిలీ వేటు
అరసవల్లి: జిల్లా వైద్యారోగ్య శాఖలో ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓల జీతాల చెల్లింపులో ఉద్దేశ్యపూ ర్వక జాప్యానికి కారణాలు, అక్రమాలపై కలెక్టర్ నియమించిన త్రీమెన్ కమిటీ విచారణ పూర్తి చేసింది. వారు ఇచ్చిన నివేదిక ప్రకారం డీఎంహెచ్ఓ కార్యాలయ ఏఓ బాబూరావుపై బదిలీ వేటు పడింది. జిల్లాలో మొత్తం 120 మంది కాంట్రాక్టు ఉద్యోగులకు ఈ ఏడాది మే లో చెల్లించాల్సిన జీతాలు ఇవ్వలేదంటూ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు వెళ్లింది. ఈ మేరకు నియమించిన ఆర్డీవో సాయి ప్రత్యూష, డీసీహెచ్ఎస్ విజయలక్ష్మి, మైన్స్ ఏడీలతో కూడిన త్రీమెన్ కమిటీ స్థానిక డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఈనెల 4న విచారణ జరిపి ఇందుకు బాధ్యుడుగా పరిపాలనాధికారి (ఏఓ) బాబూరావును గుర్తిస్తూ నివేదిక సిద్ధం చేశారు. దీంతో బాబూరావును తక్షణమే విధుల నుంచి తప్పి స్తూ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ నర్సింగ్ కళా శాల ఏఓగా బదిలీ చేశారు. కాగా ప్రభుత్వ జిల్లా జనరల్ ఆస్పత్రి (రిమ్స్)లో ఏఓగా పనిచేస్తున్న గ్రూప్–1 అధికారి పైడి ప్రదీప్కు డీఎంహెచ్ఓ కార్యాలయ ఏఓగా అదనపు బాధ్యతలను అప్పగించారు.


