● యంత్రాలతో రేకుల షెడ్డును కూల్చేసిన అధికారులు
టెక్కలి: టెక్కలి నియోజకవర్గంలో దళితులపై భౌతిక దాడులు, దళితుల ఆస్తులపై దౌర్జన్యాలు మితి మీరిపోతున్నాయి. ఇటీవల మాసాహెబ్పేట గ్రా మంలో దళిత, గిరిజన యువకులపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసిన సంఘటన మరువక మునుపే అదే మండలం కొత్తపల్లి గ్రామంలో మంగళవారం ఓ దళితుడి ఇంటి స్థలంపై అధికారులు దౌర్జన్యానికి దిగారు. వైఎస్సార్సీపీకి సానుభూతి పరుడిగా ఉన్నాడనే కారణంతో టీడీపీ నాయకుల ప్రోద్బలంతో గ్రామానికి చెందిన బాధ లక్ష్మీనారాయణ అనే దళితుడి ఇంటికి ఆనుకుని ఉన్న స్థలంలో అతనికి చెందిన రేకుల షెడ్డును యంత్రాలతో తొలగించేసి ఇంట్లో సామాన్లు, ఫలసాయం చిందరవందర చేసేశారు. బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం..
కొత్తపల్లి గ్రామంలో దళితుడు బాధ లక్ష్మీనారాయణ ఇంటికి ఆనుకుని తన స్థలంలో ఎప్పటి నుంచో రేకుల షెడ్డును వేసుకున్నాడు. ఈయన వైఎస్సార్ సీపీకి సానుభూతి పరుడిగా ఉన్నాడనే కక్షతో అది ప్రభుత్వ స్థలం అని చూపిస్తూ గ్రామానికి చెందిన కొంత మంది టీడీపీ కార్యకర్తలు అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో ఎలాంటి నోటీసులు, సమాచారం, సమయం ఇవ్వకుండా మంగళవారం హఠాత్తుగా కొంత మంది పోలీసులు, రెవెన్యూ అధికారులు కొత్తపల్లి గ్రామానికి చేరుకుని యంత్రాలతో లక్ష్మీనారాయణకు చెందిన రేకుల షెడ్డును కూల్చేశారు. కుటుంబ సభ్యులంతా మొరపెట్టుకున్నప్పటికీ షెడ్డులో సామాన్లు, ఫలసాయం మొత్తంగా చిందర వందర చేసేశారు.
గ్రామంలో సాగునీటి కాలువను కొంత మంది టీడీపీ కార్యకర్తలు కబ్జా చేస్తున్నారంటూ ఇటీవల కొంత మంది రైతులు అధికారులకు ఫిర్యాదు చేశా రు. దానిపై కక్ష సాధింపు చర్యగా ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు కొంత మంది గ్రామస్తులు చెబుతున్నారు. తనపై గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు కోరాడ సుబ్రహ్మణ్యం, శిమ్మ సింహాచలం, రెడ్డి మోహన్, రెడ్డి సింహాచలం, రెడ్డి లక్ష్మీనారాయణ తదితరులు కక్ష పెంచుకుని, ఇలా తన రేకుల షెడ్డును కూల్చేశారని బాధిత దళితుడు లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.


