శ్రీకాకుళం కల్చరల్: ఆరోగ్యకరమైన జీవనానికి యోగాసనాలు అత్యంత ఆవశ్యకమని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు. పర్యాటక ప్రాంతమైన డచ్ భవనం వద్ద నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన పాల్గొన్నారు. నేటి కాలంలో మారుతున్న జీవన శైలి, ఒత్తిడి కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. వీటన్నింటికీ సహజసిద్ధమైన, శాశ్వతమైన పరిష్కారం యోగా అని తెలిపారు. రెండు నెలల నుంచి ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నట్లు చెప్పారు. ఇది కేవలం శరీరానికి మాత్రమే కాదు, మన మనస్సును కూడా చురుగ్గా ఉంచుతుందన్నారు. జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ ఉత్తమ్ రాజ్ రాణా మాట్లాడుతూ యోగాసనాల వల్ల శరీరం ధృఢంగా ఉంటుందన్నారు.
ఆసనాలు వేయడం ద్వారా శరీరంలోని కండరాలు, కీళ్లు బలాన్ని పుంజుకుంటాయని పేర్కొన్నారు. శరీరం ఫ్లెక్సిబుల్గా మారుతుందన్నారు. యోగా మాస్టారు పాండ్రంకి మురళీకృష్ణ, పలువురు యోగా ట్రైనర్లు పాల్గొన్నారు. డచ్ భవనం వద్ద నిర్వహించిన పర్యాటక యోగాలో విద్యార్థులు, ప్రజలు, ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.


