శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): క్రైస్తవులమని, చర్చికి వెళ్తున్నామని కారణం చూపి ఇటీవల కాలంలో దళితులకు ఎస్సీ రిజర్వేషన్లు నిరాకరిస్తున్న ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని జిల్లా దళిత సంఘాల జేఏసీ (జేఏసీ) నాయకులు బొకర నారాయణరావు, కళ్లేపల్లి రాంగోపాల్, బడే కామరాజు, మిస్కా కృష్ణయ్య, దుర్గాసి గణేష్, యర్ర గడ్డయ్య అన్నారు. శ్రీకాకుళం నగరంలోని అంబేడ్కర్ విజ్ఞాన మందిరంలో శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం కేవలం హిందూ, సిక్కు, బౌద్ధ మతాల వారికే ఎస్సీ హోదా వర్తిస్తుందనే నిబంధనను సాకుగా చూపి, దళిత క్రైస్తవులను రాజ్యాంగబద్ధమైన హక్కులకు దూరం చేయడం అన్యాయమన్నారు. ‘మతం మారినంత మాత్రాన కులం మారదు. సమాజంలో అంటరానితనం, వివక్ష పోవు’ అనే సత్యాన్ని సుప్రీంకోర్టు సైతం గతంలో ప్రస్తావించిందని వారు గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం 5గంటలకు అంబేడ్కర్ విజ్ఞాన మందిర్లో భారీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ముఖ్యవక్తగా హైకోర్టు న్యాయవాది, రిటైర్డ్ జడ్జి జడ శ్రావణ్కుమార్ హాజరవుతారని పేర్కొన్నారు.


